హైదరాబాద్: భారత జట్టుకి ప్రత్యామ్నాయం లేకపోవడంతో హార్దిక్ పాండ్యాను తుది జట్టులో కొనసాగిస్తూ వచ్చింది. కానీ.. ఇంగ్లాండ్తో జరిగిన ఆఖరి టెస్టులో హనుమ విహారి, రవీంద్ర జడేజా బ్యాట్, బంతితో చక్కగా రాణించడంతో ఇప్పుడు హార్దిక్ స్థానం అనుమానస్పదంగా మారింది. ఓవల్ టెస్టులో హార్దిక్పై వేటు వేసి జడేజాకి టీమిండియా మేనేజ్మెంట్ అవకాశమిచ్చిన విషయం తెలిసిందే.
భారత జట్టులో ఏడాదికాలంగా ఆల్రౌండర్ కోటాలో స్థానం సంపాదించుకుంటున్న హార్దిక్ పాండ్యాకి స్థానం అనుమానంగానే మారింది. ఇంగ్లాండ్ గడ్డపై మంగళవారం ముగిసిన ఐదు టెస్టుల సిరీస్లో వరుసగా నాలుగు టెస్టుల్లోనూ స్థానం దక్కించుకున్న హార్దిక్ పాండ్య ఘోరంగా విఫలమవుతున్నాడు. బ్యాట్తో ఎనిమిది ఇన్నింగ్స్ల్లో కలిపి 164 పరుగులు మాత్రమే చేసిన ఈ ఆల్రౌండర్.. తీసిన వికెట్లు ఏడు మాత్రమే.
ఇంగ్లాండ్తో చివరి టెస్టుతో భారత జట్టులోకి అరంగేట్రం చేసిన హనుమ విహారి రెండు ఇన్నింగ్స్లో 56, 0 పరుగులు చేశాడు. బౌలింగ్లోనూ అతను 9.3 ఓవర్లు వేసి అప్పటికే సెంచరీతో జోరుమీదున్న జోరూట్, అలిస్టర్ కుక్తో పాటు భారత్కి కొరకరాని కొయ్యగా మారిన కుర్రాన్ని పెవిలియన్ బాట పట్టించి ప్రత్యేకత చాటుకున్నాడు. అలానే జడేజా కూడా రెండు ఇన్నింగ్స్లో 86, 13 పరుగులు చేసి ఏడు వికెట్లను పడగొట్టాడు. దీంతో.. భారత్కి ఇద్దరు ప్రత్యామ్నాయ ఆల్రౌండర్లు దొరికినట్లైంది.
దక్షిణాఫ్రికాతో ఈ ఏడాది ఆరంభంలో జరిగిన టెస్టు సిరీస్లోనూ హార్దిక్ పాండ్య విఫలమయ్యాడు. తొలి టెస్టులో 93 పరుగులు చేసిన హార్దిక్ ఆ తర్వాత.. ఐదు ఇన్నింగ్స్ల్లో చేసిన పరుగులు 23 మాత్రమే. అలానే బౌలింగ్లోనూ నిరాశపరిచాడు. అయినప్పటికీ ప్రత్యామ్నయం లేకపోవడంతో ఇంగ్లాండ్తో సిరీస్కి అతడ్ని సెలక్టర్లు ఎంపిక చేశారు. కానీ.. తాజా ప్రదర్శనతో త్వరలో వెస్టిండీస్, ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టు సిరీస్కి అతడి ఎంపిక అనుమానంగా కనిపిస్తోంది.