టీ10 లీగ్ ఆడటం ఇదే తొలిసారి:
'అబుదాబి టీ10 లీగ్ ఆడటం ఇదే తొలిసారి. ఈ లీగ్ కోసం ఎంతో ఎదురుచూస్తున్నా. టస్కర్స్ జట్టుకు కెప్టెన్గా ఎంపికవడం సంతోషంగా ఉంది. ఈ ఫార్మాట్తో క్రికెట్ ఆట మరింత తగ్గుతున్నట్లు అనిపిస్తుంది. నేను టెస్ట్, వన్డే, టీ20 క్రికెట్ ఆడటం చాలా అదృష్టంగా భావిస్తున్నా. అబుదాబిలోని స్టేడియం అద్భుతంగా ఉంది. ప్రేక్షకులు మద్దతు ఇస్తారని ఆశిస్తున్నా' అని హషీమ్ ఆమ్లా ధీమా వ్యక్తం చేశారు.
డాట్ బాల్స్ నేరం:
'ఈ లీగ్ మూడు, నాలుగేళ్లుగా జరుగుతున్నా.. కొత్త ఫార్మాట్. అయితే ఈ ఫార్మాట్లో చాలా కాలం నుంచే అందరూ ఆడుతున్నారు. చిన్నప్పుడు స్నేహితులతో ఇలాగే ఆడుతూ పెరిగా. అయితే బ్యాట్స్మన్కు కుదురుకోవడానికి అతి తక్కువ సమయం ఉంటుంది. టీ10 లీగ్లో డాట్ బాల్స్ చాలా నేరం. అత్యుత్తమ స్థాయిలో ఆడాల్సి ఉంటుంది. ఇన్నింగ్స్ ఆరంభం నుండే బ్యాట్ జులిపించాలి. మాకు మంచి జట్టు ఉంది. కానీ పేరున్న భారీ హిట్టింగ్ ఆటగాళ్లు లేరు. అయినా మేము విజయం సాధిస్తాం' అని ఆమ్లా అన్నారు.
యువ క్రికెటర్లకు మేలు:
'అబుదాబి లీగ్లో టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ఆడటం సంతోషం. ఇలాంటి లీగుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఆటగాళ్లు ఆడాలని అభిమానులు కోరుకుంటారు. యువీ గత ఇరవై ఏళ్లుగా అద్భుతమైన క్రికెటర్గా ఎదిగాడు. యువ క్రికెటర్లు అతనితో కలిసి ఆడటం ద్వారా అనేక విషయాలు నేర్చుకుంటారు. అందులో ఎలాంటి సందేహం లేదు. బీసీసీఐకి నిర్దిష్టమైన నియమాలు ఉన్నందున టీమిండియా క్రికెటర్లపై స్పందించడం సరికాదు' అని ఆమ్లా పేర్కొన్నారు.
మరాఠాతో యువీ ఒప్పందం:
యువరాజ్ రిటైర్మెంట్ ప్రకటించాక కెనడా గ్లోబల్ లీగ్లో పాల్గొన్నాడు. తాజాగా అబుదాబి టీ10 లీగ్లో మరాఠా అరేబియన్స్ తరఫున ఆడడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. డ్వేన్ బ్రేవో మరాఠా జట్టుకు కెప్టెన్. లసిత్ మలింగ, హజ్రతుల్లా జజాయ్, నజీబుల్లా జాద్రాన్, క్రిస్ లిన్ కూడా మరాఠా తరఫున ఆడనున్నారు.
నవంబర్ 15 నుంచి మూడో సీజన్:
అబుదాబి వేదికగా నవంబర్ 15 నుంచి 24 వరకు టీ10 మూడో సీజన్ జరగనుంది. ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొననున్నాయి. ఈ లీగ్లో పాక్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రీది బరిలోకి దిగనున్నాడు. అఫ్రిది కలందర్స్ జట్టు తరుపున ఆడనున్నాడు. థిసారా పెరీరా, నిరోషన్ డిక్వెల్లా, మొయిన్ అలీ, కీరన్ పోలార్డ్, ఆండ్రూ రసెల్ పలు జట్లకు ఆడుతున్నారు.