జట్టులో కోహ్లీ లేకపోవడం నిరుత్సాహానికి గురిచేసింది: పాక్ బౌలర్

హైదరాబాద్: ఆసియా కప్లో పాల్గొనే భారత జట్టులో విరాట్ కోహ్లీ లేకపోవడం తనను ఎంతో నిరుత్సాహానికి గురిచేసిందని పాకిస్థాన్ బౌలర్ హసన్ అలీ తెలిపాడు. సెప్టెంబర్ 15 నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్ జరగనున్న సంగతి తెలిసిందే. రాబోయే సిరిస్లను దృష్టిలో పెట్టుకుని విరాట్ కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ బౌలర్ హసన్ అలీ మాట్లాడుతూ ఏ బౌలరైనా ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్మన్ను ఔట్ చేయాలని ఆరాటపడటం సహజమని, తాను కూడా కోహ్లీ వికెట్ తీసి తనదైన శైలిలో పండగ చేసుకోవాలనుకున్నట్లు తెలిపాడు. కోహ్లీ వికెట్ తీస్తే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన అభిమానులు ఎంతో సంతోషపడేవారని అన్నాడు.

ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లో
2017లో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లో అమిర్ బౌలింగ్లో కోహ్లీ త్వరగానే ఔట్ కావడంతో తనకు ఆ అవకాశం రాలేదని అన్నాడు. అయితే, రాబోయే రోజుల్లో కోహ్లీకి బౌలింగ్ వేసే అవకాశం వస్తుందని తాను భావిస్తున్నట్లు హసన్ అలీ పేర్కొన్నాడు. ఆసియా కప్లో తమ లక్ష్యం ఒక్క టీమిండియానే కాదని, టోర్నీ గెలవడమే ప్రధాన లక్ష్యమని చెప్పాడు.

ఆసియా కప్లో గెలవడం కష్టం
ఈ క్రమంలో విరాట్ కోహ్లీ లేకపోవడం తమకు సానుకూలమైన అంశమని అలీ చెప్పుకొచ్చాడు. కోహ్లీ లేని టీమిండియా ఆసియా కప్లో గెలవడం కష్టమేనని.. తమ చేతిలో ఓటమి తప్పదని అలీ పేర్కొన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఓటమి తర్వాత ఇరు దేశాల మధ్య మ్యాచ్ కావడంతో టీమిండియాపై ఎక్కువ ఒత్తిడి ఉంటుందని అలీ స్పష్టం చేశాడు.

ఫేవరేట్గా తమ జట్టే ఉంది
అంతేకాదు యూఏఈలోని వాతావరణం, మైదానాలు తమ దేశాన్ని తలపిస్తాయని, చాలా సిరీస్లు ఇక్కడ ఆడిన అనుభవం ఉంది కాబట్టి టోర్నీలో ఫేవరేట్గా తమ జట్టే ఉందని కూడా హసన్ అలీ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 15న ఆసియా కప్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ప్రారంభం కానుండగా.. 19న పాక్తో టీమిండియా తలపడనుంది.

కెప్టెన్గా రోహిత్ శర్మ
ఆసియా కప్లో రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ విశ్రాంతినిచ్చిన సందర్భంలో కెప్టెన్గా రోహిత్ శర్మ వ్యవహారించనున్నాడు. వైస్ కెప్టెన్గా ఓపెనర్ శిఖర్ ధావన్ను సెలక్టర్లు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో దాయాది దేశమైన పాకిస్థాన్తో భారత జట్టు రెండు లేదా మూడు సార్లు తలపడే అవకాశం ఉంది. దీంతో కోహ్లీ లేని టీమిండియా ఎలా ఆడుతుందోననే అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఆసియా కప్లో మొత్తం ఆరు జట్లు
ఆసియా కప్లో భారత్ సహా ఆరు జట్లు పోటీపడనున్నాయి. ఈ ఆరు జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో మూడు జట్లు ఉంటాయి. టాప్-2లో నిలిచిన రెండు జట్లు కూడా సూపర్-4 స్టేజికి అర్హత సాధిస్తాయి. ఈసారి ఆసియా కప్ను 50 ఓవర్ల ఫార్మాట్లో నిర్వహిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications