టీమిండియా గట్టి పోటీదారు
ప్రపంచకప్ కోసం ముందుగానే ఆస్ట్రేలియాకు టీమిండియా చేరుకుంది. తాజాగా హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్ల మీడియా సమావేశంలో మాట్లాడుతూ... 'గత రెండు సంవత్సరాలుగా మహిళల టీ20 ప్రపంచకప్ ఛాలెంజ్లో భాగంగా ఇప్ప్పటికే చాలా మ్యాచ్లు ఆడాం. ఈ సంవత్సరం కోసం ఎదురుచూస్తున్నాం. ప్రపంచకప్లో టీమిండియా గట్టి పోటీదారు. మూడేళ్ల కాలంలో జట్టు అనుభవం ఎంతో పెరిగింది. ఎలాంటి ఒత్తిడి లేకుండా బరిలోకి దిగుతాం' అని అన్నారు.
|
గెలిస్తే.. చరిత్రలో నిలిచిపోతాం
'రోజు రోజుకీ జట్టు మెరుగవుతోంది. అందరూ సానుకూలంగా కనిపిస్తున్నారు. మేం ట్రోఫీ గెలిస్తే.. చరిత్రలో నిలిచిపోతాం. అందుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తాం. కప్ గెలిస్తే చాలా పేరొస్తుంది. పరిస్థితులు మారుమారు అయితాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ టోర్నమెంట్ అమ్మాయిలకు చాలా విశ్వాసం కలిగిస్తుంది. 2017లో మా ప్రదర్శనకు వచ్చిన స్పందన ఆశ్చర్యపరిచింది. మేం ఒత్తిడికి లోను కావొద్దని మా తల్లిదండ్రులు చెప్పారు' అని హర్మన్ప్రీత్ పేర్కొన్నారు.
ఐపీఎల్ ఉంటే బాగుండు
'మాకు మహిళల ఐపీఎల్ ఉంటే అది మాకు చాలా మేలుచేస్తుంది. మేము ప్రపంచకప్ గెలిస్తే.. జట్టుగా మాకు చాలా పెద్ద విషయం అవుతుంది. మా ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. అనుభవజ్ఞుల స్థానం పూడ్చడం కొంత కష్టమే. అయితే యువతులు వారి ప్రతిభను, సామర్థ్యాన్ని చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. గత రెండేళ్ళలో నేను జూనియర్ నుండి సీనియర్ స్థాయికి వెళ్ళాను' అని హర్మన్ప్రీత్ చెప్పుకొచ్చారు. ప్రస్తుత భారత జట్టు సగటు వయస్సు 22.8గా ఉంది. సీనియర్లు మిథాలీ రాజ్, జులన్ గోస్వామి దూరమయిన విషయం తెలిసిందే.
21న తొలి మ్యాచ్
2017లో ఇంగ్లాండ్లో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లో భారత్ ఆతిథ్య జట్టు చేతిలో 9 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. అయితే అద్భుత ప్రదర్శనతో అందరి మనసులు గెలుచుకుంది. ఫిబ్రవరి 21న డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో అడిలైడ్లో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది.