
ముంబై: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియాతో పాటు భారత మహిళా క్రికెటర్లు స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్ కౌర్లు కూడా ఇంగ్లాండ్లో పర్యటిస్తున్నారు. ఇంగ్లాండ్ దేశీవాలీ లీగ్ అయిన కియా సూపర్ లీగ్లో ఆడుతున్న స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్ కౌర్లు వీర విహారం చేస్తున్నారు. బ్యాట్తో పరుగుల వరద పారిస్తూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. వాళ్లు కొట్టే షాట్లకు ప్రేక్షకులంతా ఆశ్చర్యానికి లోనవుతున్నారు.
తాజాగా హర్మన్ ప్రీత్ బాదిన ఓ బౌండరీకి కారు అద్దం పగిలింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. 'అమ్మో... మహిళల క్రికెట్ చాలా ప్రమాదకరం' అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు. లీగ్లో భాగంగా లాంక్షైర్ థండర్-యార్క్షైర్ డైమెండ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో లాంక్షైర్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న హర్మన్ 22 బంతుల్లో 74 పరుగులు చేసింది. ఆరు సిక్స్లు, నాలుగు ఫోర్లు నమోదు చేసింది.
హర్మన్ బాదిన ఓ సిక్స్కు బంతి నేరుగా వెళ్లి మైదానానికి సమీపంలో ఉన్న కారు అద్దానికి తాకింది. దీంతో అద్దానికి పగుళ్లు వచ్చాయి. ఇందుకు సంబంధించిన ఫొటోను ఓ నెటిజన్ తన ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ 'మహిళల క్రికెట్ చాలా ప్రమాదకరం. హర్మన్ బాదిన ఓ సిక్స్కు కారు అద్దానికి పగుళ్లు వచ్చాయి' అని పేర్కొన్నాడు. దీనికి నెటిజన్లు స్పందిస్తూ.. 'అమ్మో మహిళల క్రికెట్ ప్రమాదకరమే; మహిళల శక్తి అంటే ఇదే' అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ మ్యాచ్లో హర్మన్ జట్టు థండర్స్ 9 పరుగుల తేడాతో విజయం సాధించింది.
రెండ్రోజుల క్రితం జరిగిన మ్యాచ్లో హర్మన్ప్రీత్ కొట్టిన షాట్ వల్ల జరిగే ప్రమాదం తృటిలో తప్పింది. మ్యాచ్ గురించి మాట్లాడేందుకు స్టేడియంకు వచ్చిన రిపోర్టర్ మాట్లాడుతూ.. ఉండగా హర్మన్ ప్రీత్ కొట్టిన షాట్ బౌండరీని దాటి ఎగురుకుంటూ అతని తలకు కొద్ది దూరంలో నుంచి పోయింది. ఇప్పటికే ఈమెతో పాటు లీగ్లో దూసుకెళ్తున్న స్మృతి మంధాన రాకెట్ వేగంతో దూసుకెళ్తుంది. హాఫ్ సెంచరీలు, సెంచరీలు అతి తక్కువ బంతుల్లో బాదేసి రికార్డులు నెలకొల్పుతోంది.