
హైదరాబాద్: భారత మహిళా జట్టు టీ20 కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ త్వరలోనే పంజాబ్ పోలీసు శాఖ ఉద్యోగంలో చేరేందుకు రైల్వే శాఖ అనుమతి ఇచ్చింది. హర్మన్ ప్రీత్ కౌర్ గత మూడేళ్లుగా స్పోర్ట్స్ కోటాలో పశ్చిమ రైల్వేలో ఉద్యోగం చేస్తున్న సంగతి తెలిసిందే.
గతేడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగిన మహిళల వరల్డ్ కప్లో అద్భుత ప్రదర్శన చేసిన ఆమె దేశవ్యాప్తంగా ప్రశంసలందుకుంది. దీంతో హర్మన్ ప్రీత్ కౌర్కు పంజాబ్ ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగం ఇస్తున్నట్లు గత జులైలో ప్రకటించింది. పోలీసు ఉద్యోగం అంటే బాగుంటుందని కాబట్టి డీఎస్పీ పోస్టుని తీసుకునేందుకు గాను హర్మన్ ప్రీత్ ప్రస్తుతం తాను చేస్తున్న రైల్వే ఉద్యోగానికి రాజీనామా చేసింది.
అయితే ఆమెను రిలీవ్ చేసేందుకు పశ్చిమ రైల్వే నిబంధనలను సాకుగా చూపించింది. పశ్చిమ రైల్వేతో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. ఆఫీస్ సూపరింటెండెంట్గా ఉద్యోగం చేయడానికి ఐదేళ్లపాటు ఒప్పందం చేసుకుంది. ఉద్యోగం మానేసి వెళ్లాలనుకుంటే ఐదేళ్ల జీతం రూ. 27 లక్షలను కట్టి వెళ్లాలని పశ్చిమ రైల్వే జనరల్ మేనేజర్ తేల్చి చెప్పారు.
అయితే ఆమె అంత మొత్తం చెల్లించలేనని చెప్పింది. దాదాపు ఐదు నెలలుగా అటు పంజాబ్ ప్రభుత్వం నుంచి, రైల్వే నుంచి ఎలాంటి జీతం తీసుకోకుండా ఉంది. దీంతో ఈ విషయంలో సానుకూలంగా వ్యవహరించాలని కేంద్ర రైల్వేమంత్రి పియూష్ గోయల్కు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ లేఖ రాశారు.
అందులో హర్మన్ ప్రీత్ కేసుని వేరే కోణంలో చూడాలని ఆమె రాజీనామాను ఆమోదించాల్సిందిగా కోరారు. దీంతో ఆమె డీఎస్పీ పదవి చేపట్టేందుకు లైన్ క్లియర్ అయింది. ఈ సందర్భంగా సఫారీ పర్యటనలో ఉన్న హర్మన్ ప్రీత్ కౌర్ గురువారం ట్విటర్లో తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.
'పంజాబ్ పోలీస్ శాఖలో డీఎస్పీగా బాధ్యతలు చేపట్టబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రైల్వేతో చేసుకున్న బాండ్ రద్దు విషయంలో చేసిన కృషికి ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ గారికి ధన్యవాదాలు. మీ మద్దతు, ప్రోత్సాహం ఎప్పటికీ నేను అత్యుత్తమంగా రాణించేందుకు ప్రేరణగా నిలుస్తాయి. ఈ సమస్య నుంచి బయటపడేలా సాయం చేసిన కేంద్ర రైల్వే మంత్రి పియూశ్ గోయల్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు' అని ట్వీట్ చేసింది.