39 బంతుల్లోనే సెంచరీ:
డీవై పాటిల్ టీ20లో టోర్నీలో భాగంగా బీపీసీఎల్ జట్టుతో జరిగిన మ్యాచ్లో రిలయన్స్-1 జట్టు తరఫున బరిలోకి దిగిన హార్దిక్ పాండ్యా భారీ సెంచరీ సాధించాడు. మిడాన్ మీదుగా సిక్స్ కొట్టి శతకం పూర్తి చేసుకున్నాడు. కేవలం 39 బంతుల్లోనే సెంచరీ చేసాడు. ఆ తర్వాత మరింత రెచ్చిపోయి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. బంతి వేయడమే ఆలస్యం.. వెళ్లి బౌండరీ ఆవల పడింది అంటే ఎంతలా విధ్వంసం సృష్టించాడో అర్ధం చేసుకోవచ్చు. మొత్తంగా 55 బంతుల్లో 20 సిక్స్లు, 6 ఫోర్లతో 158 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తాజా శతకం ఈ టోర్నీలో హార్దిక్కు రెండో సెంచరీ.
అయ్యర్ రికార్డు బద్దలు:
158 పరుగులు చేసి టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రికార్డును హార్దిక్ పాండ్యా నమోదు చేశాడు. అంతకుముందు టీ20 ఫార్మాట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన భారత క్రికెటర్ రికార్డు శ్రేయస్ అయ్యర్ పేరిట ఉండేది. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో అయ్యర్ 147 పరుగులు చేసాడు. ఇప్పుడు ఆ రికార్డును హార్దిక్ బ్రేక్ చేశాడు.
104 పరుగుల తేడాతో ఘన విజయం:
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బీపీసీఎల్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో మొదటగా బ్యాటింగ్ చేసిన రిలయన్స్-1 భారీ చేసింది. హార్దిక్ పాండ్యా ధాటిగా బ్యాటింగ్ చేయడంతో రిలయన్స్-1 స్కోరు బోర్డుపై 238 పరుగుల్ని ఉంచింది. అనంతరం బ్యాటింగ్ చేసిన బీపీసీఎల్ 18.4 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో రిలయన్స్ 104 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.
39 బంతుల్లో 105 పరుగులు:
డీవై పాటిల్ టీ20లో టోర్నీలో అంతకుముందు సీఏజీ జట్టుతో జరిగిన మ్యాచ్లో హార్దిక్ పాండ్యా 39 బంతుల్లో 7 ఫోర్లు 10 సిక్సర్లతో 105 పరుగులు చేసాడు. అంతకుముందు 25 బంతుల్లో ఒక ఫోర్, నాలుగు సిక్స్లతో 38 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో పాండ్యా మెరుపు ఇన్నింగ్స్ ఆడడం ఇది మూడోసారి.
ఫ్యాన్స్ ఎంజాయ్:
హార్దిక్ పాండ్యా భారీ ఇన్నింగ్స్లతో ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. పాండ్యా ఫామ్లోకి వచ్చాడని, ముంబైకి తిరుగులేదని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముంబై కీలక ఆటగాడైన హార్దిక్ కోలుకోవడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. ఇప్పటికే ఆ జట్టు ఫిజియో ఈ టోర్నీలో పాండ్యా ఫిట్నెస్ను పర్యవేక్షించారు.
దక్షిణాఫ్రికాతో సిరీస్తో ఎంట్రీ:
గతేడాది సెప్టెంబర్లో వెన్నుగాయంతో టీమిండియాకు దూరమైన హార్దిక్ పాండ్యా.. శస్త్ర చికిత్స తర్వాత న్యూజిలాండ్-ఎ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కానీ అతను వర్క్లోడ్ టెస్ట్లో విఫలమవడంతో ఆ టూర్కు దూరమయ్యాడు. పాండ్యాను జట్టులో తీసుకురావాడానికి టీమ్ మేనేజ్మెంట్ బాగా ప్రయత్నించింది. అతని కోసం జట్ల ఎంపికను కూడా వాయిదా వేసింది. అతను పూర్తి స్థాయిలో సిద్దం కాలేదని భావించి ప్రత్యామ్నాయ ఆటగాడిని ఎంచుకుంది. మార్చి 12 నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్తో పాండ్యా ఎంట్రీ ఇవ్వనున్నాడు.