వారితో అసలు పోల్చుకోను:
'భారత జట్టు కోసం పోరాడటమే నా బాధ్యత. హార్దిక్ ఎలా బ్యాటింగ్ చేశాడు?. గొప్ప ప్రదర్శన చేశాడా లేదా అని ఆలోచించను. నేను 10 పరుగులు చేసిన జట్టు విజయం సాధిస్తే ఎంతో ఆనందిస్తా. 30 పరుగులు చేసినపుడు ఓడితే ఎంతో బాధపడతా. ఆల్రౌండర్లు కపిల్ దేవ్ , బెన్ స్టోక్స్తో నేను ఎప్పుడూ పోల్చుకోను. అత్యుత్తమంగా ఆడటానికే ప్రయత్నిస్తా. జట్టు విజయాలే నా లక్ష్యం. హార్దిక్లానే నేను ఉంటా' అని పాండ్యా అన్నాడు.
జీవితంలో ఎదురైన కఠిన పరిస్థితి:
'బాగా గుర్తుంది. ఆ 10 రోజులు (కాఫీ విత్ కరణ్) ఇంట్లోంచి బయటకే రాలేదు. సమస్యను ఎదుర్కోనే తీరు ఇదికాదని వారం, పది రోజుల తర్వాత అర్థమైంది. ఇది నా జీవితంలో ఎదురైన కఠిన పరిస్థితి అని తెలుసుకున్నా. ఆపై నా దృష్టినంతా ఆటపైకి మళ్లించా. జరిగింది మర్చిపోయాను. ఆర్నెల్లు సస్పెండ్ చేస్తారా? తర్వాత మ్యాచులోనే ఆడిస్తారా అని పట్టించుకోలేదు' అని పాండ్యా తెలిపాడు.
వేగంగా కోలుకోవడం ఎంతో సంతోషం:
'వెన్నెముక శస్త్రచికిత్స అనంతరం వేగంగా కోలుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. శస్త్రచికిత్స తర్వాత ఎలా ఉన్నానో అని విరాట్ కోహ్లీ సందేశం పంపించాడు. బాగున్నాను కానీ ఎవరికీ ఇలాంటి అనుభవం ఎదుర్కోవాల్సి రాకూడదని బదులిచ్చా. మందులు వేసుకోవడం, కోలుకోవడం సవాల్గా అనిపించింది. 100 కేజీల బరువెత్తే నేను కనీసం కాలు కూడా కదపలేకపోయా. మన శరీరం సాధారణంగా 100% ప్రయత్నించేందుకు అలవాటై ఉంటుంది. కోలుకోవడం అంత సులభం కాదు. ఎంతో కష్టపడ్డా' అని పాండ్యా చెప్పుకొచ్చాడు.
శంకర్కు అవకాశం:
శనివారం నిర్వహించిన యోయో ఫిట్నెస్ పరీక్షలో హార్దిక్ విఫలమైన విషయం తెలిసిందే. అంతర్జాతీయ మ్యాచ్ ప్రమాణాలకు తగిన విధంగా ఫిట్నెస్ టెస్టులో సాధించాల్సిన కనీస స్కోరును అందుకోలేకపోయాడు. దీంతో భారత్-ఎ జట్టు తరఫున ఎంపికైన అతని స్థానంలో మరో ఆల్రౌండర్ విజయ్ శంకర్ను ఎంపికచేశారు. అంతేకాదు న్యూజిలాండ్ పర్యటనకు అతని పేరును పరిగణనలోకి తీసుకోవడం లేదు.