భీకరమైన స్ట్రైక్ రేట్ ఉన్న ప్లేయర్
ఐపీఎల్ 2022లో 13మ్యాచ్ల్లో 285పరుగులతో ఆర్సీబీ జట్టులో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడు కార్తీక్. అతను ఈ పరుగులు లోయర్ ఆర్డర్లో చేయడం గమనార్హం. ఇన్నింగ్స్ ముగిసే క్రమంలో, ఛేజింగ్ టైంలో కార్తీక్ ఈ రన్స్ చేశాడు. అనుభవజ్ఞుడైన వికెట్ కీపర్, ఫినిషర్ పాత్రను దినేష్ కార్తీక్ పోషిస్తున్నాడు. ఇక ఈ సీజన్లో ఎనిమిది సార్లు నాటౌట్గా నిలిచిన కార్తీక్.. 57.00సగటుతో స్కోరు చేశాడు. అతని స్ట్రైక్-రేట్ సైతం భీకరంగా ఉంది. 192.57 స్ట్రైక్ రేట్తో అతను పరుగులు చేయడం గమనార్హం.
ఈ సీజన్లో నా అభిప్రాయం ప్రకారం అతనే అత్యుత్తమ ఫినిషర్
అత్యుత్తమ గణాంకాలు, ప్రదర్శనతో దినేష్ కార్తీక్ ఈ సీజన్లో ఆడుతుండడంతో అతను తిరిగి టీమిండియా తరఫున ఆడడం ఖాయమనే విశ్లేషణలు ఎక్కువయ్యాయి. తాజాగా భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కార్తీక్కు మద్దతుగా అతను టీమిండియాలో ఆడాలని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. స్టార్ స్పోర్ట్స్లో గేమ్ప్లాన్ ఎపిసోడ్ సందర్భంగా హర్భజన్ మాట్లాడుతూ.. ఆర్సీబీ జట్టులో దినేష్ కార్తీక్ అత్యుత్తమ ప్లేయర్గా ఉన్నాడు. అతను ఆఫ్ సైడ్ల కంటే లెగ్ సైడ్ షాట్లలో చాలా ప్రావీణ్యం కనబరుస్తున్నాడు. సింగిల్స్ కూడా చాలా చక్కగా తీస్తున్నాడు. మ్యాచ్ను బాగా అర్థం చేసుకుంటున్నాడు. అవసరమైనప్పుడల్లా ఫినిషింగ్ చేయడంలో చాలా సమర్థంగా ఆడుతున్నాడు. ఈ సీజన్లో ఎవరైనా ఫినిషర్గా అత్యుత్తమ పాత్ర పోషించినట్లయితే అది దినేష్ కార్తీక్ అనే చెబుతాను' అని హర్భజన్ పేర్కొన్నాడు.
టీమిండియాకు వారిద్దరు అవసరం
ఇంకా హార్భజన్ మాట్లాడుతూ.. నేను సెలెక్టర్ అయినట్లయితే ప్రపంచకప్ టీ20 కోసం అతనికి ఆస్ట్రేలియా ఫ్లైట్ టిక్కెట్ ఇప్పిస్తాను. వికెట్ కీపర్ కం బ్యాట్స్మెన్గా అతన్ని టీమిండియా తరఫున ఆడించాలి. అతను టీమిండియాలో ఆడేందుకు అర్హుడు. టీమిండియాకు ఇప్పుడు అత్యుత్తమ ఫినిషర్ అవసరం గనుక దినేష్ కార్తీక్ జట్టులో ఉండాలి. కార్తీక్తో పాటు హార్దిక్ పాండ్యా కూడా జట్టులో ఉంటే జట్టు దుర్భేద్యమవుతుంది. ఏదేమైనా దినేష్ మాత్రం ఈ సీజన్లో తన అసలు సత్తాను చూపుతున్నాడని మాత్రం చెబుతాను అని భజ్జీ పేర్కొన్నాడు.