
హైదరాబాద్: లార్డ్స్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్తో జరిగే రెండో టెస్టులో చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ను ఆడించాలని టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్టు గురువారం లార్డ్స్లో ప్రారంభం కానుంది.
ఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్ మాట్లాడుతూ లార్డ్స్లో ఎండ బాగా కాసే అవకాశం ఉండటంతో కుల్దీప్ను ఆడించాలని అన్నాడు. టాస్ ఓడి బౌలింగ్కు దిగితే కుల్దీప్ మెరుగైన అవకాశాలను సృష్టించగలడని తెలిపాడు. "టాస్ ఓడి తొలి రోజు టీమిండియా చివరి వరకు బౌలింగ్ చేస్తున్నప్పుడు మంచి పిచ్పై కుల్దీప్ వికెట్లు తీసి అవకాశాలు సృష్టిస్తాడు" అని అన్నాడు.
"గూగ్లీలు సంధిస్తాడు. ఎడమ చేతితో లెగ్స్పిన్ వేస్తాడు. ఎడ్జ్బాస్టన్లో భారత్ ఒక స్పిన్నర్ను ఆడించి పొరపాటు చేసింది. హార్దిక్ పాండ్యా స్థానంలో కుల్దీప్ యాదవ్ను ఆడిస్తే బాగుండేది" అని అన్నాడు. ఎడ్జ్బాస్టన్లో టీమిండియా యాజమాన్యం స్థానిక పరిస్థితులను అంచనా వేయడంలో విఫలమైందని భజ్జీ పేర్కొన్నాడు.
"వాతావరణం వేడిగా, పిచ్ పొడిగా, సూర్యుడు బాగా ఎండ కాస్తున్నప్పుడు స్పిన్నర్ను ఆడించాలి. నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్ పాచిక పారలేదు" అని హర్భజన్ అన్నాడు. తొలి టెస్టులో పేసర్లంతా కలిసి 13 వికెట్లు తీస్తే అశ్విన్ ఒక్కడే 7 వికెట్లు పడగొట్టిన సంగతి తెలిసిందే.
ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో కోహ్లీసేన 31 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీంతో లార్డ్స్ టెస్టుని కోహ్లీసేన ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ మైదానంలో ఇప్పటి వరకు 17 టెస్టులాడిన టీమిండియా కేవలం రెండింట్లో మాత్రమే విజయాలను నమోదు చేసింది. మరోవైపు 11 టెస్టుల్లో ఓటమి పాలుకాగా, నాలుగు టెస్టులను డ్రాగా ముగించింది.