తల వెనుక భాగంలో ముఖం ఆకారం:
టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మంగళవారం తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫన్నీ ఫొటో పంచుకున్నాడు. తల వెనుక భాగంలో ముఖం ఆకారం వచ్చేలా కటింగ్ ఉంది. ఓ బార్బర్ తన కస్టమర్ తల వెనుక భాగంలో మనిషి ముఖం ఆకారం వచ్చేలా విచిత్రంగా కటింగ్ చేశాడు. కళ్లద్దాలు, గెడ్డంతో ఉన్న ఆ ఫొటో అచ్చం మనిషి ముఖంలాగే ఉంది. సదరు బార్బర్ ఆ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో నవ్వులు పూయిస్తోంది.
కరోనా కన్ఫ్యూజ్ అవ్వడానికే:
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే హర్భజన్ సింగ్ ఈ ఫొటో తన కంట పడగానే.. ఆలస్యం చేయకుండా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసాడు. 'ఏ వైపు నుండి ప్రవేశించాలో తెలియక కరోనా వైరస్ కన్ఫ్యూజ్ అవ్వడానికే ఈ కటింగ్' అంటూ ఆ ఫొటోకు కామెంట్ను జతచేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్గా మారింది. చూసిన వారందరు ఫొటో, కామెంట్ చూసి తెగ నవ్వుకుంటున్నారు. 'మనం కూడా కరోనాను కన్ఫ్యూజ్ చేద్దాం' అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా.. 'అందరూ ఈ కటింగ్ చేసుకుంటే కరోనా మన దగ్గరకు రాదు' అని మరో నెటిజన్ కెమెంట్ చేసాడు.
ఇప్పుడైతే క్రికెట్ నా ఆలోచనల్లో లేదు:
దేశంలో నెలకొన్న దుర్భర పరిస్థితుల్లో తాను క్రికెట్ గురించి కానీ, ఐపీఎల్ గురించి కానీ ఆలోచిస్తే స్వార్థపరుడిని అవతానని హర్భజన్ తెలిపాడు. ‘నిజంగా ఇప్పుడు నేను క్రికెట్ గురించి ఆలోచించట్లేదు. గత నెలన్నర రోజులుగా దాని ధ్యాసేలేదు. దేశం ముందు అది చాలా చిన్నది. ఒకవేళ ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో నేను క్రికెట్, ఐపీఎల్ గురించి ఆలోచిస్తే స్వార్థపరుడిని అవుతా. సంపూర్ణ ఆరోగ్య భారత దేశమే ఇప్పుడు మన ప్రధాన కర్తవ్యం. మనమంతా ఆరోగ్యంగా, జాగ్రత్తగా ఉంటేనే క్రీడలు జరుగుతాయి. ఇప్పుడైతే క్రికెట్ నా ఆలోచనల్లో కూడా లేదు' అని భజ్జీ స్పష్టం చేశాడు.
అదే ధోనీ లాస్ట్ మ్యాచ్:
తాజాగా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మతో ఇన్స్టాగ్రామ్ లైవ్లో పాల్గొన్న హర్భజన్ సింగ్ పలు విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. లైవ్ సందర్భంగా ఎంఎస్ ధోనీ తిరిగి ఎప్పుడు అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతాడు అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు భజ్జీ సమాధానం ఇచ్చాడు. 'ధోనీ ఐపీఎల్లో ఆడాలని కృతనిశ్చయంతో ఉన్నాడు. కానీ.. ఇక్కడ అందరికీ తెలియాల్సింది ఏంటంటే భారత్ జట్టుకి మళ్లీ ఆడాలని ధోనీ ఆశిస్తున్నాడా? లేదా?. నా అంచనా ప్రకారం టీమిండియాకి ఆడాలనే ఇంట్రస్ట్ ప్రస్తుతం అతనికి లేదు. మళ్లీ టీమిండియా జెర్సీ ధరించాలని అతనికి లేదు. 2019 వన్డే ప్రపంచకప్లోనే చివరి అంతర్జాతీయ మ్యాచ్ని ఆడేశానని అతను భావిస్తున్నాడు' అని హర్భజన్ తెలిపాడు.