భజ్జీ ఇండియా టుడేతో మాట్లాడుతూ
ఈ నేపథ్యంలో భజ్జీ ఇండియా టుడేతో మాట్లాడుతూ "రేపు పొద్దున ఏ పార్టీలోనైనా వారిని కలిస్తే మీరు మాట్లాడుతారేమో కానీ.. నేను మాత్రం మాట్లాడను. అలాగే ఒకే టీమ్ బస్సులో కూడా నేను వారితో ప్రయాణించలేను. ఎందుకుంటే నాతో నా భార్య, కూతురు ఉంటుంది. హర్దిక్ ప్రతి ఒక్కరి గౌరవాన్ని తీసేలా ప్రవర్తించాడు" అని అన్నాడు.
మా మిత్రులతోనూ చర్చించం
"మేం ఇలాంటివి కనీసం మా మిత్రులతోనూ చర్చించం. వారు టీవీల్లో కనిపిస్తారు. ఇప్పుడు ప్రజలు హర్భజన్ సింగ్ ఇలాంటోడు, అనిల్ కుంబ్లే అలాంటోడు, సచిన్ ఇలాంటివాడు అనుకునే ప్రమాదం ఉంది" అని భజ్జీ అన్నాడు. ఎక్కువ మంది మహిళలతో కలవాలని ఉందని తల్లిదండ్రులకు చెప్పినట్టు పాండ్య షోలో నోరుజారిన సంగతి తెలిసిందే.
గదుల్లో పని కానిచ్చేశారా?
"మరి మీ జట్టు సహచరుల గదుల్లో పని కానిచ్చేశారా?" అని షోలో కరణ్ ప్రశ్నించగా రాహుల్, పాండ్య సానుకూలంగా స్పందించారు. దీని భజ్జీ "అంతగా ఖాళీగా ఉంటే నీకేం కావాలో దానిపై దృష్టి పెట్టాలి. ఖాళీ సమయాల్లో ఏ ఆటగాడు ఏం చేస్తుండో కనిపెట్టాల్సిన అవసరం అవినీతి నిరోధక యూనిట్ (ఏసీయూ)కు ఉంది. ఆటగాళ్లు ఈ తరహా నోరు జారకుండా నిబంధనలు కఠినతరం చేయాలన్నారు. భారత జట్టుకు ఓ గౌరవం ఉంది" అని అన్నాడు.
గౌరవాన్ని చెడగొట్టారు
"ఆ గౌరవాన్ని ఈ తరహా వ్యాఖ్యలతో వీరు చెడగొట్టారు. క్రికెట్ ఆడే ప్రతి సీనియర్కు, జట్టుకు చెడ్డ పేరు తీసుకొచ్చారు. అసలు జట్టు సంస్కృతి గురించి అసభ్యకరంగా మాట్లాడానికి పాండ్య ఎంత కాలం నుంచి జట్టులో ఉంటున్నాడు? వారిపై ఇలా కఠినంగా వ్యవహరించడమే మంచిది. తాను గత 25 ఏళ్ల నుంచి క్రికెట్ ఆడుతున్నానని, ఇతరుల గురించి ఎప్పుడూ మాట్లాడలేదు" అని భజ్జీ అన్నాడు
బీసీసీఐ సరైన పనే చేసింది
"బీసీసీఐ సరైన పనే చేసింది. వేటు వేయడం నాకు ఆశ్చర్యం కలిగించలేదు. విరాట్ కోహ్లీ కూడా జట్టంతా వారితో కలిసుండాలనుకోవడం లేదని స్పష్టం చేశాడు" అని హర్భజన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘కాఫీ విత్ కరణ్' టాక్ షోలో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న వీరిద్దరిపై బీసీసీఐ సస్పెన్షన్ వేటు పడింది. దీంతో ప్రస్తుతం ఆసీస్ పర్యటనలో ఉన్న వీరిద్దరూ భారత్కు తిరుగు పయనం కానున్నారు.
విచారణను ఎదుర్కోనున్న రాహుల్, పాండ్యా
ఈ ఇద్దరిపై విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగనుంది. భారత్కు తిరిగొచ్చి వీరిద్దరూ విచారణను ఎదుర్కోనున్నారు. తొలుత ఈ ఇద్దరిపై రెండు వన్డేల నిషేధం విధించాలని భావించినప్పటికీ... చివరికు విచారణ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈ ఇద్దరిపై విచారణకు ఆదేశించామని, అది పూర్తయ్యే వరకు సస్పెండ్ చేస్తున్నామని సీఓఏ చైర్మన్ వినోద్ రాయ్ వెల్లడించారు.