జాబితా నుండి తొలగింపు:
ఖేల్రత్న అవార్డు కోసం పంజాబ్ ప్రభుత్వం కేంద్రానికి సిఫారసు చేస్తూ సిద్ధం చేసిన జాబితాలో తొలుత హర్బజన్ సింగ్ పేరును చేర్చింది. అనంతరం హర్భజన్ పేరును తొలగించారు. దీనిపై సర్వత్రా ఆసక్తికర చర్చ మొదలైంది. కొందరైతే ఏకంగా బజ్జీకే ఫోన్లు చేస్తూ తమ విచారం వ్యక్తం చేశారు. దాంతో రంగంలోకి దిగిన హర్బజన్ సింగ్.. పంజాబ్ ప్రభుత్వం చర్యలపై తాజాగా వివరణ ఇచ్చారు.
2016 నుంచి క్రికెట్కు దూరం:
గత మూడు సంవత్సరాలుగా క్రీడాకారులు చూపే ప్రదర్శన ఆధారంగా ఖేల్రత్న అవార్డుకు సిఫారసు చేయాలన్న నిబంధనలు ఉన్నాయి. అయితే 40 ఏళ్ల వయసున్న హర్బజన్ సింగ్.. 2016 నుంచి క్రికెట్కు దూరంగా ఉంటున్నాడు. భజ్జీ 2016లో చివరిసారి ఆసియాకప్లో భారత జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించాడు. అప్పటి నుంచి సీనియర్ ఆఫ్ స్పిన్నర్గా ఐపీఎల్లో కొనసాగుతున్నాడు. కెరీర్ మొత్తంలో 103 టెస్టులు, 236 వన్డేలు, 28 టీ20 ఆడిన హర్భజన్ వరుసగా 417, 269, 25 వికెట్లు తీశాడు.
నేను అర్హుడను కాదు:
ఖేల్రత్న పురస్కారానికి గతేడాది తాను ఆలస్యంగా దరఖాస్తు చేశానని, ఈసారి తన పేరును తొలగించిన నేపథ్యంలో ఎవరూ ప్రభుత్వాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదన్నాడు. ' ఖేల్రత్న అవార్డు జాబితా నుంచి పంజాబ్ ప్రభుత్వం నా పేరు తొలగించిందంటూ చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. నిజమే.. ఖేల్రత్న అవార్డు కోసం నా పేరును సిఫారసు చేయడానికి నేను అర్హుడను కాదు. గత మూడేళ్ల ప్రదర్శన మేరకు ఈ అవార్డుకు ఎంపికచేస్తారు. పంజాబ్ ప్రభుత్వం తన పేరును కావాలని తొలగించలేదు. మీడియాలోని స్నేహితులు ఈ విషయాన్ని గుర్తిస్తారని కోరుతున్నా' అని హర్బజన్ సింగ్ చెప్పాడు.