ఐపీఎల్లో రాణించినా.. ధోని ఇండియాకు ఆడడు : భజ్జీ

న్యూఢిల్లీ : మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఇండియా తరఫున చివరి మ్యాచ్ ఆడేశాడని టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తెలిపాడు. వన్డే వరల్డ్కప్ ఓటమి అనంతరం దాదాపు ఆరునెలలు ఆటకు దూరంగా ఉన్న ధోనిని 2019-20 సెంట్రల్ కాంట్రాక్టుల నుంచి బీసీసీఐ తొలగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్ తన ఐపీఎల్ కెప్టెన్ కెరీర్ గురించి ఓ మీడియా చానల్తో మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నేషనల్ క్రికెట్లో ధోని రీ ఎంట్రీ ఉంటుందని అనుకోవడం లేదని తెలిపాడు. ' దాదాపు ధోని కెరీర్ ముగిసినట్టే. వన్డే వరల్డ్కప్ అతనికి ఇండియా తరఫున చివరి టోర్నీ అని విన్నా. ఆ టోర్నీ తర్వాత అతను మళ్లీ బరిలోకి దిగలేదు. అతను ఎప్పుడో నిర్ణయం తీసుకున్నాడు. అందుకే ఆడటం లేదు.'అని హర్భజన్ చెప్పుకొచ్చాడు.
అంతేకాకుండా ఐపీఎల్లో రాణించినా అతను ఇండియా తరఫున ఆడడని స్పష్టం చేశాడు. 'ధోని ఐపీఎల్లో కచ్చితంగా రాణిస్తాడు. అతని హార్డ్ వర్క్ అలాంటిది. అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ అతను ఫామ్లోకి వచ్చినా.. ఇండియా తరఫున మాత్రం మళ్లీ బరిలోకి దిగడు. ఇప్పటికే అతను వన్డే వరల్డ్ కప్లోనే చివరి మ్యాచ్ ఆడేశాడు.'అని భజ్జీ అభిప్రాయపడ్డాడు. ఇక భజ్జీ ఐపీఎల్లో ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఆడుతున్న విషయం తెలిసిందే.
ఇక మాజీ క్రికెటర్ మదన్ లాల్ కూడా ధోని రీ ఎంట్రీ కష్టమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 'నాకు తెలిసి ధోని అప్ కమింగ్ టీ20 వరల్డ్ కప్ ఆడటం చాలా కష్టం. 99 శాతం అతను పునరాగమనం చేయడు. ఒక్కశాతం మాత్రమే అతనికి చాన్స్ ఉంది. ఇంటర్నేషన్ క్రికెట్ దూరమైన అతను డొమెస్టిక్ క్రికెట్ కూడా ఆడటం లేదు. కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతుండటంతో బీసీసీఐ కాంట్రాక్టు కోల్పోయాడు' అని మదన్ లాల్ చెప్పుకొచ్చాడు.
వన్డే వరల్డ్ కప్ సెమీస్లో న్యూజిలాండ్ చేతిలో పరాజయం అనంతరం ధోని దాదాపు 6 నెలలు మైదానానికి దూరమయ్యాడు. ఆర్మీలో ఉద్యోగం చేయడానికి రెండు నెలల విశ్రాంతి తీసుకొని వెస్టిండీస్ టూర్కు దూరంగా ఉన్నాడు. తర్వాత తన క్రికెట్ కెరీర్ గురించి జనవరి వరకు ప్రశ్నించవద్దని తెలిపిన ధోని.. స్వదేశంలో జరిగిన సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్, శ్రీలంక సిరీస్లకు సైతం అందుబాటులోకి లేడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications