హైదరాబాద్: ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా జరుగుతోన్నటెస్టు సిరీస్లో భారత్ పేలవంగా ఆడుతోంది. దీనిపై నెటిజన్లతో పాటుగా దిగ్గజాలు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విషయంపై కామెంట్ చేసేవారిలో ఇప్పుడు హర్భజన్ కూడా చేరిపోయాడు. కోహ్లీ కెప్టెన్సీతో పాటు కోచ్ రవిశాస్త్రికి కూడా చురకలు అంటించాడు. అటు బీసీసీఐ కూడా కఠిన చర్యలకు సిద్ధమవుతోంది.
మూడో టెస్ట్ తర్వాత కెప్టెన్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రిలు కొన్ని కఠినమైన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని బోర్డుకు చెందిన సీనియర్ అధికారి ఒకరు స్పష్టంచేశారు. వాళ్లిద్దరి అధికారాలకు కత్తెర వేయాలని కూడా చూస్తున్నారు. తాజాగా టీమిండియా స్పిన్నర్ హర్భజన్ సింగ్ అయితే కోచ్ రవిశాస్త్రిపై తీవ్రంగా మండిపడ్డాడు. జట్టు చెత్త ప్రదర్శనకు కోచ్నే బాధ్యుడిని చేయాలని అతను అంటున్నాడు.
ప్రముఖ టీవీ ఛానెల్తో భజ్జీ మాట్లాడాడు. 'ఈరోజు కాకపోతే తర్వాతైనా దీనిపై కోచ్యే స్పందించి.. సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అతనే అందరికీ జవాబుదారీ. ఒకవేళ సిరీస్ ఓడిపోతే అతడు గతంలో చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. వాతావరణ పరిస్థితులనేవి కచ్చితంగా ఆటపై ప్రభావం చూపుతాయని అతను అంగీకరించాలి' అని హర్భజన్ అన్నాడు. ఇంగ్లాండ్ సిరీస్కు వెళ్లే ముందు అక్కడి వాతావరణ పరిస్థితుల్ని.. పిచ్ స్వభావాన్ని రవిశాస్త్రి లైట్ తీసుకున్నాడు. తాము ఏ జట్టుకు భయపడబోమని, ఇండియా అత్యుత్తమ విదేశీ జట్లలో ఒకటని అన్నాడు.
'మేము ప్రత్యర్థితో తలపడం.. పిచ్తోనే తలపడతాం. పిచ్ను జయించడమే మా పని అని రవిశాస్త్రి టూర్కు ముందు చెప్పాడు. కండిషన్స్తో మాకు సంబంధం లేదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా 20 వికెట్లు తీసుకునే బౌలర్లు ఉన్నారు. బ్యాట్స్మెనే కాస్త జాగ్రత్తగా ఆడాలి' అని రవిశాస్త్రి అన్నాడు. అతనితో ఏకీభవించిన కోహ్లీ కూడా దాదాపు అవే అర్థం వచ్చే మాటలు చెప్పాడు. అయితే ఎక్కడికి వెళ్లినా అక్కడి పరిస్థితులు ఆటపై ప్రభావం చూపుతాయన్న కీలక అంశాన్ని రవిశాస్త్రి విస్మరించడంపై హర్భజన్ మండిపడ్డాడు.