కౌంటీ క్రికెట్ ఆడుతా:
తాజాగా హనుమ విహారి మాట్లాడుతూ... 'ఈ సీజన్లో నేను నాలుగు ఇంగ్లిష్ కౌంటీ గేమ్స్ ఆడాలి. ఒక జట్టుతో ఒప్పందం దాదాపుగా ఖరారైంది. ఏ జట్టుకు ఆడబోతున్నానో పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తా. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ పరిస్థితుల నేపథ్యంలో ఇది నిలిచిపోయింది. కరోనా అదుపులోకి వస్తుందని.. కౌంటీ ఆడతానని ఆశిస్తున్నా. కౌంటీ అనుభవం నాకు ఎంతో ఉపయోగపడుతుంది' అని తెలిపాడు.తమిళనాడు లీగ్లో ఆడటం ద్వారా తన మ్యాచ్ ప్రాక్టీస్ కొనసాగించినట్లు అతను చెప్పాడు.
జట్టును గెలిపించేదే అత్యుత్తమ ఇన్నింగ్స్:
ఇటీవల న్యూజిలాండ్తో క్రైస్ట్చర్చ్లో జరిగిన రెండో టెస్టులో విహారి చక్కటి ప్రదర్శన కనబర్చాడు. హాగ్లీ ఓవల్ మైదానంలో బౌలింగ్కు బాగా అనుకూలించిన పిచ్పై 70 బంతుల్లో 55 పరుగులు సాధించాడు. అయితే ఇది తన అత్యుత్తమ ప్రదర్శనగా భావించడం లేదని విహారి తెలిపాడు. 'ఇది నా అత్యుత్తమ ఇన్నింగ్స్ అని అనుకోను. నేను ఆ మ్యాచ్లో బాగానే ఆడాను. కానీ ఆ ఇన్నింగ్స్ జట్టును గెలిపించలేపోయింది. కఠిన పరిస్థితుల్లో పరుగులు సాధించడం ఆనందంగా అనిపించింది. దాని కంటే జట్టు విజయం సాధించడమే గొప్ప విషయం' అని విహారి పేర్కొన్నాడు.
9 టెస్టులు.. 552 పరుగులు:
9 టెస్టుల కెరీర్లో ఒక మ్యాచ్ మినహా (వైజాగ్లో దక్షిణాఫ్రికాపై) విహారి 8 టెస్టులు విదేశాల్లోనే ఆడాడు. 2018లో ఇంగ్లండ్ టెస్టుతో అరంగేట్రం చేసిన ఈ ఆంధ్రా ఆటగాడు టెస్టు జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు. ముఖ్యంగా విదేశాల్లో గొప్పగా రాణిస్తాడని ప్రశంసలు అందుకున్నాడు. భారత్ తరఫున 9 టెస్టులు ఆడి 36.8 సగటుతో 552 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఏ స్థానంలోనైనా ఆడటానికి సిద్ధం:
'నా ఆటపై నాకు నమ్మకం ఉంది. విదేశాల్లో గొప్పగా ఆడతానని జట్టు భావిస్తుంది. విదేశీ పరస్థితులను చక్కగా అర్థం చేసుకుంటాను కాబట్టే బాగా రాణిస్తున్నా. ఏ స్థానంలోనైనా జట్టు కోసం ఆడటానికి సిద్ధంగా ఉన్నాను. విదేశాల్లోనే కాకుండా సొంతగడ్డపై కూడా నాకు అవకాశాలు వస్తాయని భావిస్తున్నా. కఠోర శ్రమ, ఎలాంటి పరిస్థితుల్లో అయినా బాగా ఆడటమే నా లక్ష్యం. ప్రస్తుతం కరోనా ప్రభావంతో వ్యక్తిగత శిక్షణలు తీసుకుంటున్నాం' అని విహారి చెప్పుకొచ్చాడు.