ఆ ఓపిక నాకుంది..
జట్టుకు అవసరమైనప్పుడు క్రీజ్లో పాతుకుపోయి మరీ పరుగులు చేయగలడు. ఈ క్రమంలోనే జట్టులోని పోటీ గురించి ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడిన విహారి.. తాను ఏ స్థానంలోనైనా బ్యాటింగ్కు దిగేందుకు సిద్దమేనని తెలిపాడు. దేశవాళీలోనూ అనేక ఏళ్లపాటు ఇబ్బందులు పడ్డానని, అవకాశాలు తేలిగ్గా రాలేదని విహారి చెప్పుకొచ్చాడు. 'దేశవాళీ క్రికెట్లో చాలా ఏళ్లపాటు స్థిరంగా రాణించినా జాతీయ జట్టులోకి వచ్చేందుకు సమయం పట్టింది. అందుకే అవకాశాలు వచ్చే వరకు వేచి చూసేంత ఓపిక నాకుంది.
వచ్చిన అవకాశాన్ని వదులుకోను..
ఓపిగ్గా ఎదురు చూసిన తర్వాత వచ్చిన అవకాశాలను ఏమాత్రం వదులుకోకూడదని అనుకున్నా. అవకాశాలు రాలేదని వేరొకరిపై నెపం నెట్టడం సరైంది కాదు. ఎందుకంటే మన దగ్గర పోటీ చాలా తీవ్రంగా ఉంటుంది. దేశవ్యాప్తంగా చాలా మంది తమకెప్పుడు జాతీయ జట్టులో అవకాశం వస్తుందా..? అని ఎదురు చూస్తూ ఉంటారు. అయితే బరిలోకి దిగిన తర్వాత మాత్రం నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికే ప్రయత్నిస్తా'' అని విహారి చెప్పుకొచ్చాడు.
కోహ్లీ మాటలతో..
టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ ప్రశంసలు తననెంతో ఉద్వేగానికి గురి చేశాయని విహారి తెలిపాడు. విహారిని ఓపెనింగ్ చేయమని అడిగినప్పుడు అతను స్పందించిన విధానం తనను ఆకట్టుకుందని విరాట్ కోహ్లీ కొనియాడాడు. భారత జట్టు తరఫున ఆడేందుకు అతను ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకు సిద్దంగా ఉన్నాడని అర్థమైందని బీసీసీఐ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ చెప్పుకొచ్చాడు. కోహ్లీ చేసిన ఈ వ్యాఖ్యలు తనను ఉద్వేగానికి గురి చేసాయని విహారి తెలిపాడు.
పుజారాతో పోటీ..
ఇంగ్లండ్తో జరిగే ఏకైక టెస్ట్లో విహారికి చోటు దక్కడం కష్టమే. ఫస్ట్ డౌన్లో టీమిండియా నయావాల్ చతేశ్వర్ పుజారా ఆడే అవకాశం ఉంది. గత కొంతకాలంగా పేలవ ఫామ్ కనబరుస్తున్న పుజారా.. తన చెత్తాటతో శ్రీలంకతో టెస్ట్ సిరీస్కు ఎంపికవ్వలేదు. దాంతో ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడిన పుజారా డబుల్ సెంచరీలతో తన సత్తా ఏంటో చూపించాడు.
ప్రస్తుతం సూపర్ టచ్లో కనిపిస్తున్నాడు. హనుమ విహారి సైతం ఐపీఎల్ సమయంలో కౌంటీ క్రికెట్ ఆడాడు. ఇప్పుడు ఈ ఇద్దరిలో ఒకరిని తీసుకోవడం టీమ్మేనేజ్మెంట్కు తలనొప్పిగా మారింది. కానీ పుజారాకే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. రోహిత్ శర్మ కరోనాతో దూరమైన నేపథ్యంలో అతని స్థానంలో విహారీ ఓపెనింగ్ చేసే అవకాశాలున్నాయి.