ఆయన వల్లే మేమిలా ఆడగలిగాం:
తాజాగా హనుమ విహారి మాట్లాడుతూ... 'సిడ్నీ టెస్టు తర్వాత రాహుల్ ద్రవిడ్ నుంచి సందేశం రావడం సంతోషంగా అనిపించింది. గొప్పగా ఆడావని ఆయన ప్రశంసించారు. ఆయనెంతో గొప్ప వ్యక్తి. ఆయనను నేనెంతగానో ఆరాధిస్తాను. నిజానికి ఆయన వల్లే రంజీలు, భారత్ మధ్య అంతరం తొలగిపోయింది. భారత్-ఏకు ఆడుతున్నప్పుడు మమ్మల్ని మేం నిరూపించుకొనేలా ఆయన స్వేచ్ఛనిచ్చేవారు. సిరాజ్, సైనీ, శుభ్మన్, మయాంక్, నేను కలిసి భారత్-ఏకు ఆడాం. 3-4 ఏళ్లు ఆయన మాకు కోచింగ్ ఇచ్చారు. ఆయన ఏర్పాటు చేసిన షాడో పర్యటనల వల్లే మేమీ సవాళ్లకు సిద్ధపడ్డాం. ఆయన వల్లే మేమిలా ఆడగలిగాం' అని అన్నాడు.
కోహ్లీ అదే చెప్పాడు:
'అడిలైడ్లో 36 పరుగులకే ఆలౌటైనా మేమేమి కుంగిపోలేదు. ఆటలో గెలుపోటములు భాగమని అందరికీ తెలుసు. అయితే మరీ పేలవంగా ఆడాం కాబట్టి డ్రెస్సింగ్ రూంలో చర్చ జరిగింది. అక్కడితో అంతా ముగిసింది. హోటల్కు వెళ్లి ఎవరి గదిలో వాళ్లు కూర్చొని బాధపడటాలు లేవు. డ్రెస్సింగ్ రూమ్ దాటిన తర్వాత అంతా మామూలుగా అయిపోయాం. కెప్టెన్ విరాట్ కోహ్లీ స్వదేశం పయనమవ్వాల్సి ఉండటంతో.. ఆ రోజు రాత్రి అందరం కలిసి భోజనం చేశాం. "ఓటమి గురించి ఎక్కువ ఆలోచించొద్దు. మాపై మేము నమ్మకాన్ని కోల్పోవద్దు" అని సూచించాడు. 3 మ్యాచ్ల సిరీస్ అనుకుని ఆడమని చెప్పాడు. అలాగే ఆడాం. 2-0తో సిరీస్ను గెలిచాం. సిరీస్ ఆసాంతం పాజిటివ్గానే ఉన్నాం' అని విహారి తెలిపాడు.
పుజారానే వెన్నెముక:
'టీమిండియా బ్యాటింగ్కు పుజారానే వెన్నెముక. అతడి ఖాతాలో ఎక్కువ పరుగులు లేకపోవచ్చు. కానీ పుజారా క్రీజులో ఉండటమే అతిపెద్ద సానుకూలాంశం. అంకెలు ప్రధానం కాదు. అతడు ఎంతసేపు క్రీజులో ఉన్నాడన్నది ముఖ్యం. ఒక ఎండ్లో వికెట్లు పడకుండా ఆపేవాళ్లు ఉంటే అవతలి ఎండ్లోని బ్యాట్స్మన్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయొచ్చు. అతడిచ్చిన ఆత్మ విశ్వాసంతోనే మిగతా బ్యాట్స్మెన్ పరుగులు రాబట్టారు. క్రికెట్ను బాగా అర్థం చేసుకునేవాళ్లకు ఈ సిరీస్లో పుజారా ప్రాధాన్యం తెలుస్తుంది' అని తెలుగు క్రికెటర్ చెప్పాడు.
పంత్ డ్రా కోసం ప్రయత్నించలేదు:
'బ్యాటింగ్లో పంత్ దూకుడు గురించి అందరికీ తెలుసు. ఈ సిరీస్లో అతను సహజ సిద్ధమైన ఆటే ఆడాడు. పంత్ ఎక్కువసేపు క్రీజులో ఉంటే మ్యాచ్ విన్నర్ అవుతాడు. బ్రిస్బేన్లో అదే జరిగింది. ఏ సందర్భంలోనూ పంత్ డ్రా కోసం ప్రయత్నించలేదు. చివరి బంతి వరకు క్రీజులో ఉండాలన్న తపన అతనిలో కనిపించింది. నిజానికి తొలి ఇన్నింగ్స్లో వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్ల భాగస్వామ్యం లేకపోతే మ్యాచ్.. సిరీస్ ఫలితం మరోలా ఉండేదేమో. తుదిజట్టులో ఉండటం మన చేతుల్లో లేదు. జట్టు గెలవడానికి ఎలాంటి కూర్పు కావాలన్నది యాజమాన్యం నిర్ణయిస్తుంది. సొంతగడ్డపై ఒకలా.. విదేశాల్లో మరోలా పరిస్థితులు ఉంటాయి. అందుకు తగ్గట్లు తుది జట్టును ఎంపిక చేస్తారు' అని విహారి చెప్పుకొచ్చాడు.
మన నట్టూకు స్వాగతం అదిరిపోయిందిగా.. రథంపై ఊరేగిస్తూ సంబరాలు!! (వీడియో)