హైదరాబాద్: న్యూజిలాండ్తో జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా చెత్త ప్రదర్శనపై వస్తోన్న విమర్శలపై బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ స్పందించాడు. కోహ్లీ, ధోనీ లేకపోవడం వల్లే టీమిండియా మ్యాచ్ ఓడిపోయిందని వస్తోన్న విమర్శలపై సంజయ్ బంగర్ మీడియాతో మాట్లాడాడు.
పాండ్యా చేసిన తప్పిదానికి భారత్ ఖాతాలో ఒక పరుగు కోత పడింది (వీడియో)
"హామిల్టన్ వన్డే టీమిండియాకు ఎంతో మేలు చేసింది. ఇక్కడ ఈ పరిస్థితి తలెత్తింది కాబట్టి టీమిండియాకు దీని నుంచి పాఠం నేర్చుకునే అవకాశం కలిగింది. ఇదే పరిస్థితి వరల్డ్ కప్లో ఎదురైతే టీమిండియా ఆశలు గల్లంతయ్యేవి. వరల్డ్ కప్లో తొమ్మిది మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. ఇందులో కొందరు గాయం వల్ల దూరం కావచ్చు. మరికొందరు టోర్నీలోనే ఆడకపోవచ్చు" అని అన్నాడు.
"ఈ ప్రభావం అంతా జట్టుపై పడుతుంది. ఇవన్నీ టీమిండియాకు పాఠాలే. ఒక్క వైఫల్యాన్ని ఆధారంగా తీసుకుని విమర్శించడం సరికాదు. గాయం కారణంగా హామిల్టన్ వన్డేలో ఇద్దరు ఆటగాళ్లును కోల్పోవాల్సి వచ్చింది. ప్రస్తుతం టీమిండియాలో ఉన్నవాళ్లందరూ నాణ్యమైన ఆటగాళ్లే. మిడిలార్డర్ విఫలమైందని నిందించే ముందు ఒక్కసారి గతం మ్యాచ్లను కూడా పరిగణనలోకి తీసుకోవాలి" అని చెప్పుకొచ్చాడు.
"మిడిలార్డర్లో ఉన్న ఆటగాళ్లే ఎన్నోసార్లు ఆటను ముగించిన సందర్భాలు ఉన్నాయి. అన్ని ఫార్మాట్లలోనూ ఆడే ఆటగాళ్లకి అంతర్జాతీయ మ్యాచ్ల్లో ఆడటం పెద్ద కష్టమేం కాదు. మిగిలిన వారిని కూడా ఆస్థాయిలో ఆడేలా మేం ట్రైనింగ్ ఇస్తున్నాం. టీమిండియా విఫలమైందని విమర్శించే వారి మాటలు కొత్తగా జట్టులోకి వచ్చిన వారిని బాధపెడతాయి. క్రీడా స్ఫూర్తి లేని వాళ్లే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారు" అని అన్నాడు.