2-1తో టెస్టు సిరిస్ కైవసం
తాజా పర్యటనలో ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియాను ఓడించి 2-1తో టెస్టు సిరిస్ను సొంతం చేసుకుంది. భారత క్రికెట్ జట్టుకు ట్రోఫీని అందజేసే అవకాశం లభించివుంటే ఎంతో గర్వపడేవాడినని సునీల్ గవాస్కర్ అన్నాడు. "నాకెంతో గర్వంగా ఉంది. ఆసీస్ గడ్డపై కోహ్లీసేన చరిత్రాత్మక విజయం సాధించిన ఆ సందర్భంలో నా కళ్లు చెమర్చాయి" అని చెప్పుకొచ్చాడు.
ఎంతో ఆనందపడేవాడిని
"భారత్కు ట్రోఫీని అందించే అరుదైన అవకాశం లభించివుంటే ఎంతో ఆనందపడేవాడిని. తొలిసారి ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియాను టీమిండియా ఓడించింది. కనీసం సిడ్నీ వెళ్లివుంటే నా స్నేహితుడు అలెన్ బోర్డర్ను కలిసివుండేవాడి" అని సునీల్ గవాస్కర్ చెప్పాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ బహూకరణ విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా నిర్వాకం వల్ల గవాస్కర్కు ఆహ్వానం పంపలేదు.
బోర్డర్తో కలిసి ట్రోఫీని అందించలేకపోయాడు
దీంతో గవాస్కర్ అక్కడికి వెళ్లడం లేదు. బోర్డర్తో కలిసి ట్రోఫీని అందించలేకపోయాడు. నిజానికి క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) సీఈఓ జేమ్స్ సదర్లాండ్ గత మే నెలలో గవాస్కర్కు ముందస్తు సమాచారం ఇచ్చారు. ఆ మరుసటి నెలలోనే సదర్లాండ్ తన పదవికి రాజీనామా చేశారు. గవాస్కర్కు ముందస్తు సమాచారమైతే ఉంది కానీ అనంతరం క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి అధికారిక ఆహ్వానం మాత్రం అందలేదు.
స్వయంగా వెల్లడించిన గవాస్కర్
కనీసం సిరీస్కు ముందైనా చెబితే సోనీ సంస్థ ఏదైనా ప్రత్యామ్నాయం చేసుకునేదని ఇప్పుడు మాత్రం ఏ అవకాశం లేదని గవాస్కర్ వెల్లడించారు. "ఈ ట్రోఫీ ప్రదానోత్సవానికి రావడం కుదురుతుందా అని మే నెలలోనే క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ జేమ్స్ సదర్లాండ్ అడిగాడు. సంతోషంగా వస్తా అని చెప్పా. కానీ తర్వాత సదర్లాండ్ పదవి నుంచి దిగిపోయాడు. ఆపై నన్నెవరూ సంప్రదించలేదు'' అని గావస్కర్ అన్నాడు.
సీఏ వాదన మరోలా
మరోవైపు సీఏ కమ్యూనికేషన్స్ హెడ్ టిమ్ విటకెర్ మాట్లాడుతూ జూన్లో ఒకసారి, ఆగస్టులో మరోసారి గవాస్కర్కు ఆహ్వానాలు పంపామని అన్నారు. అయితే ఈ ఆహ్వానాల స్క్రీన్ షాట్స్ చూపగలరా? అంటే మాత్రం ‘మీడియాకు మా అధికారిక ఆహ్వానాలు వెల్లడించం' అని ఆయన బదులిచ్చారు. దీంతో ఈ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని బోర్డర్ ఒక్కడే బహూకరించాడు.