చెన్నై: టీమిండియా మాజీ ఆటగాడు, హైదరాబాద్ సొగసరిగా పేరొందిన వీవీఎస్ లక్ష్మణ్ ప్రత్యర్థి ఆటగాళ్లతో పాటు సహచరులతోనూ హుందాగా వ్యవహరిస్తారు. భారత జట్టుకు ప్రపంచ ఖ్యాతి తెచ్చిన ఆటగాళ్లలో లక్ష్మణ్ ఒకరు. లక్ష్మణ్కు కోపం రావడం చాలా అరుదు. ఎన్నో మ్యాచుల్లో భారత్ను విజయతీరాలకు చేర్చిన లక్ష్మణ్కు బాగా కోపం వచ్చిన ఘటనను టీమిండియా వెటరన్ బ్యాట్స్మన్ సురేష్ రైనా గుర్తుచేసుకున్నాడు. సహచర క్రికెటర్ ప్రగ్యాన్ ఓజాపై లక్ష్మణ్ కోప్పడినట్లు రైనా వెల్లడించాడు.
'బాబర్ సుదీర్ఘకాలం పాక్ జట్టుని నడిపించగలడు.. విజయవంతమైన కెప్టెన్ అవుతాడు'
యూట్యూబ్లో ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రాతో జరిగిన ఇంటర్వ్యూలో సురేష్ రైనా మాట్లాడుతూ... 2010లో మొహాలీలో ఆసీస్తో జరిగిన టెస్టు మ్యాచ్ను గుర్తుచేసుకున్నాడు. మొహాలి వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్లో 216 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా 124 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి కష్టాలో పడింది. ఈ సమయంలో పేసర్ ఇషాంత్ శర్మతో కలిసి 81 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన లక్ష్మణ్.. టీమిండియాకి అనూహ్య విజయాన్ని అందించాడు. అయితే ఇషాంత్ పెవిలియన్ చేరిన తర్వాత క్రీజులోకి వచ్చిన ఓజా.. పరుగు విషయంలో తొందరపడడంతో అసహనానికి గురైన లక్ష్మణ్ అతనిపై ఒక్కసారిగా అరిచాడట.
సురేష్ రైనా మాట్లాడుతూ... 'ఆ మ్యాచ్లో లక్ష్మణ్ వెన్ను నొప్పితో బాధపడ్డాడు. దాంతో నేను రన్నర్గా వెళ్లాను. ఓజా బాగానే బ్యాటింగ్ చేసున్నాడు. అయితే ఓసారి అనవసరంగా పరుగు కోసం ప్రయత్నించాడు. ఓజా తొందరపాటు కారణంగా నేను కూడా పరుగుకి వెళ్లగా.. ఫీల్డర్ మైకేల్ హస్సీ బంతిని వికెట్లపైకి విసిరాడు. దాంతో లక్ష్మణ్ ఔట్ కాకూడదని నేను డైవ్ చేశాను. ఓవర్ చివరి బంతికి పరుగు తీసి లక్ష్మణ్కు స్ట్రయికింగ్ ఇవ్వడం ఓజా పని. ఆ సమయంలో ఓజా రన్ కోసం సరిగా పరిగెత్తడం లేదని లక్ష్మణ్కు కోపం వచ్చింది. పరిగెత్తు ఓజా అంటూ ఒక్కసారిగా అరిచేశాడు. అప్పడు వీవీఎస్ కోపాన్ని చూసాను' అని రైనా వెల్లడించాడు.
ఆ మ్యాచ్లో లక్ష్మణ్ 79 బంతుల్లో 73 పరుగులతో అజేయంగా నిలిచాడు.మరోవైపు స్పిన్నర్ ప్రగ్యాన్ ఓజా 5 పరుగులతో సపోర్ట్ ఇచ్చాడు. ఎంతో కస్టపడి చివరికి జట్టును ఎప్పటిలాగే విజయతీరాలకు చేర్చాడు లక్ష్మణ్. ఆ తర్వాత బెంగళూరు టెస్టుని కూడా గెలిచిన భారత్ సిరీస్ని 2-0తో చేజిక్కించుకుంది. వీవీఎస్ లక్ష్మణ్ భారత్ తరఫున 134 టెస్టులు ఆడి 8781 పరుగులు చేసారు. ఇందులో 17 సెంచరీలు, 56 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక 86 వన్డేల్లో 2338 పరుగులు బాదారు. వన్డేల్లో 6 సెంచరీలు, 10 అర్ధ సెంచరీలు కొట్టారు.