
పూణే: చెన్నైసూపర్ కింగ్స్పై గుజరాత్ టైటాన్స్ ఆటగాడు డేవిడ్ మిల్లర్ విశ్వరూపం చూపించాడు. తన విధ్వంసకర ఆట తీరుతో చివరి వరకు క్రీజులో నిలిచి గుజరాత్ టైటాన్స్ను ఒంటి చేతితో గెలిపించాడు. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో చివరి ఓవర్లో జోర్దాన్ వేసిన నో బాల్ కారణంగా ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడిన మిల్లర్ గుజరాత్కు 3 వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు. సీఎస్కేను మాత్రం నో బాల్ ముంచింది. ఒక వైపు వికెట్లు పడుతున్నప్పటికీ పట్టు వదలకుండా ఒంటరి పోరాటం చేసిన మిల్లర్ 8 ఫోర్లు, 6 సిక్సులతో 51 బంతుల్లోనే 94 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. మిల్లర్కు తోడుగా చివర్లో రషీద్ ఖాన్ కూడా పరుగుల వరద పారించడం జట్టుకు కలిసొచ్చింది. దీంతో 87 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన దశ నుంచి గుజరాత్ విజయాన్ని అందుకుంది. మిల్లర్ విధ్వంసంతో సీఎస్కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(73) ఇన్నింగ్స్ వృథా అయింది.
మిల్లర్ ఒంటరి పోరాటం
గుజరాత్ స్కోర్ 48 పరుగుల వద్ద ఉండగా.. 18 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేసిన వృద్ధిమాన్ సాహా.. జడేజా బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి రుతురాజ్ గైక్వాడ్కు దొరికిపోయాడు. దీంతో గుజరాత్ నాల్గో వికెట్ కోల్పోయింది. అయితే ఒక వైపు వికెట్లు పడుతున్నప్పటికీ డేవిడ్ మిల్లర్ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. రాహుల్ తెవాటియాతో కలిసి ఐదో వికెట్కు 39 పరుగులు జోడించాడు. కానీ జట్టు స్కోర్ 87 పరుగుల వద్ద ఉండగా.. బ్రావో వేసిన 13వ ఓవర్లో రాహుల్ తెవాటియా(6) ఔటయ్యాడు. దీంతో గుజరాత్ 87 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది.
దుమ్ములేపిన మిల్లర్, రషీద్
ఇక గుజరాత్ గెలపు కష్టమనుకుంటున్న సమయంలో డేవిడ్ మిల్లర్, రషీద్ ఖాన్ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరు ఫోర్లు, సిక్సర్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో 37 బంతుల్లోనే 70 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మిల్లర్ 28 బంతుల్లో ఐపీఎల్లో 11వ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. చివరి 3 ఓవర్లలో గుజరాత్కు 48 పరుగులు కావాల్సిన సమయంలో జోర్దాన్ వేసిన 18వ ఓవర్లో 3 సిక్సులు, ఒక ఫోర్తో రషీద్ ఖాన్ ఏకంగా 25 పరుగులు బాదేశాడు. దీంతో ఒక్క సారిగా మ్యాచ్ గుజరాత్ వైపు తిరిగింది. ఆ జట్టు విజయానికి చివరి 2 ఓవర్లలో 23 పరుగులు కావాల్సి వచ్చింది. ఈ క్రమంలో బ్రావో వేసిన 19వ ఓవర్లో తొలి 3 బంతులకు 8 పరుగులు వచ్చాయి. అయితే ఆ ఓవర్ ఐదో బంతికి భారీ షాట్కు ప్రయత్నించి రషీద్ ఖాన్ ఔటయ్యాడు. 2 ఫోర్లు, 3 సిక్సులతో 21 బంతుల్లోనే 40 పరుగులు చేసి రషీద్ ఖాన్ ఔటయ్యాడు. ఇక చివరి బంతికి జోసెఫ్ కూడా ఔటవడంతో గుజరాత్ 157 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది.
సీఎస్కే కొంపముంచిన నో బాల్
ఒక వైపు వికెట్లు పడుతున్నప్పటికీ డేవిడ్ మిల్లర్ మాత్రం తన ఒంటరి పోరాటం కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో గుజరాత్ విజయానికి చివరి ఓవర్లో 13 పరుగులు కావాల్సిన సమయంలో మిల్లర్ స్ట్రైకింగ్లో ఉన్నాడు. చివరి ఓవర్ను జోర్దాన్ వేశాడు. ఆ ఓవర్ తొలి రెండు బంతులకు పరుగులు రాకపోవడంతో 4 బంతుల్లో 13 పరుగులుగా మారింది. ఈ క్రమంలో మూడో బంతనిఇ లెగ్ సైడ్ మీదుగా మిల్లర్ సిక్సర్ బాదాడు. ఇక ఫుల్ టాస్గా వచ్చిన నాల్గో బంతిని మిల్లర్ వెనకకు కొట్టగా మొయిన్ అలీ క్యాచ్ తీసుకున్నాడు. కానీ ఆ బంతి నిబంధనలకు విరుద్ధంగా ఎత్తుగా రావడంతో అంపైర్లు నో బాల్గా ప్రకటించారు. దీంతో మిల్లర్ ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఒక వేళ ఆ బాల్ నో బాల్ కాకపోయి ఉంటే మ్యాచ్ సీఎస్కే వైపు వెళ్లేది. ఇక వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్న మిల్లర్ ఆ తర్వాతి బంతిని ఫోర్, ఐదో బంతికి 2 పరుగులు చేసి మరో బంతి మిగిలి ఉండగానే గుజరాత్ టైటాన్స్ను 3 వికెట్ల తేడాతో గెలిపించాడు. మొత్తంగా 51 బంతులు ఎదుర్కొన్న మిల్లర్ 8 ఫోర్లు, 6 సిక్సులతో 94 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. చెన్నై బౌలర్లలో బ్రావో 3, తీక్షణ 2, రవీంద్ర జడేజా, ముఖేష్ చౌదరీ తలో వికెట్ తీశారు.
రుతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీ
అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నైసూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 5 ఫోర్లు, 5 సిక్సులతో 48 బంతుల్లో 73 పరుగులు చేశాడు. గైక్వాడ్కు అంబటి రాయుడు కూడా సహకరించాడు. 4 పోర్లు, 2 సిక్సులతో అంబటి రాయుడు 31 బంతుల్లో 46 పరుగులు చేశాడు. గైక్వాడ్, రాయుడు మూడో వికెట్కు 92 పరుగుల భాగస్వామ్మాన్ని నెలకొల్పారు. చివరి జడేజా 12 బంతుల్లోనే 22 పరుగులు చేశాడు. దీపక్ హుడా 19 పరుగులు చేశాడు. ఊతప్ప(3), మొయిన్ అలీ(1) తక్కువ స్కోర్లకే ఔటై నిరాశపరిచారు. గుజరాత్ బౌలర్లలో జోసెఫ్ 2, షమీ, యష్ దయాల్ తలో వికెట్ తీశారు.
స్కోర్లు
చెన్నైసూపర్ కింగ్స్: 169-5
గుజరాత్ టైటాన్స్: 170-7
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్: డేవిడ్ మిల్లర్