దేవుడా కాస్తా దయ చూపించు:
దేశం కరోనా సంక్షోభంలో చిక్కుకున్నప్పటి నుంచి సామాజిక మాధ్యమాల్లో రవిచంద్రన్ అశ్విన్ చురుగ్గా ఉంటున్న విషయం తెలిసిందే. కరోనా మహమ్మారితో ఇంకా ఎంతమంది ప్రజలు చనిపోవాలని, దేవుడా కాస్త దయ చూపించు అని యాష్ కోరాడు. సామాజిక దూరం పాటించకపోవడం త్వరలో నేరంగా మారవచ్చని పేర్కొన్నాడు. 'ఈ సంక్షోభమంతా ముగిసిన తర్వాత నన్ను లేపండి. ఇంకా ఎంతమంది ప్రజలు చనిపోవాలి. ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోండి. దయచేసి మాస్క్ ధరించండి. సామాజిక దూరం పాటించకపోవడం త్వరలో నేరంగా మారవచ్చు. దేవుడా కాస్తా దయ చూపించు' అని యాష్ ట్వీట్ చేశాడు.
ఎన్ 95 మాస్క్ల పంపిణీ:
కరోనా వైరస్పై అవగాహన కల్పించే విషయంలో ఆర్ అశ్విన్ ఎప్పుడూ ముందుంటాడు. ఇటీవలే మహమ్మారికి సంబంధించి ట్విటర్ వేదికగా అభిమానులకు పలు సూచనలు చేశాడు. బట్టతో తయారు చేసిన మాస్క్లు కాకుండా ఎన్95 మాస్క్లను వాడాలని కోరాడు. వీలైనంత త్వరగా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించాడు. తన ట్విటర్ యూజర్ నేమ్ను కూడా మాస్క్ అప్ ఇండియా (బట్ట మాస్క్లు) వాడవద్దని మార్చాడు. ఈ ట్వీట్పై స్పందించిన ఓ నెటిజన్.. ఎన్ 95 మాస్క్లు ఖరీదైనవి. వాటిని మేము వాడలేమని కామెంట్ చేశాడు. దీనికి అశ్విన్ బదులిస్తూ 'ఎన్95 మాస్క్ను శుభ్రం చేసి మళ్లీ వాడుకోవచ్చు. వాటిని కొనలేని వారికి నేను ఇవ్వగలను. అవి ప్రజలకు ఎలా చేరాలన్నది నాకు సూచించండి చాలు' అని పేర్కొన్నాడు.
ఐపీఎల్ 2021లో విఫలం:
ఐపీఎల్ 2021లో ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడుతున్న ఆర్ అశ్విన్.. లీగ్ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న విషయం తెలిసిందే. పిల్లలు సహా తన కుటుంబ సభ్యులు వైరస్ బారిన పడటంతో మధ్యలోనే టోర్నీని వీడాడు. చెన్నైకి వచ్చి తన కుటుంబ సభ్యులను దగ్గరుండి చూసుకున్నాడు. ఈ సీజన్లో అశ్విన్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. 5 మ్యాచ్లను ఆడిన యాష్.. కేవలం ఒక వికెట్ మాత్రమే పడగొట్టాడు. పలు జట్లలో కరోనా కేసులు వెలుగుచూడడంతో ఐపీఎల్ 2021 సీజన్ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే.
అదే ప్రదర్శన చేయాలని:
జూన్ 18-22 మధ్య సౌథాంప్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ జరగనుంది. అనంతరం ఇంగ్లండ్తో భారత్ ఐదు టెస్టు మ్యాచులు ఆడనుంది. ఇందు కోసం బీసీసీఐ ఇటీవల జంబో జట్టును ప్రకటించింది. అందులో రవిచంద్రన్ అశ్విన్ చోటు దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్తో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. వచ్చే సిరీసులో కూడా అదే ప్రదర్శన చేయాలని భారత్ కోరుకుంటోంది.