ముంబై: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో భారత మహిళలు తొలి సారి ఫైనల్కు చేరిన విషయం తెలిసిందే. అద్భుత ప్రదర్శనతో సాధించిన వరుస విజయాలు అసలు సమయంలో అక్కరకు వచ్చాయి. వర్షంతో మైదానంలో అడుగు పెట్టకపోయినా విజయం మన జట్టును వెతుక్కుంటూ వచ్చింది. ఇంగ్లండ్తో గురువారం జరగాల్సిన సెమీఫైనల్ మ్యాచ్లో వాన కారణంగా ఒక్క బంతి పడకపోయినా... లీగ్ దశలో అజేయంగా నిలిచిన హర్మన్ సేన తుది పోరుకు అర్హత సాధించింది.
భారత మహిళల విజయంపై యావత్ భారతం హర్షం వ్యక్తం చేస్తోంది. ఇదే జోరును కొనసాగిస్తూ ఫైనల్లో విజయం సాధించాలని ఆకాంక్షిస్తోంది. ఇప్పటికే మాజీ, ప్రస్తుత క్రికెటర్లు అమ్మాయిలపై అభినందనల ట్వీట్లతో ప్రశంసల జల్లు కురిపించారు. ఫైనల్ మ్యాచ్కు ఆల్దబెస్ట్ చెప్పారు.
ఇంగ్లండ్ పాపం పండింది.. భారత్ ఫైనల్ చేరింది..!!
ఇక కీలక సమరం ముందు భారత అమ్మాయిలకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విలువైన సలహా ఇచ్చాడు. ఒత్తిడిని దరిచేరనీయకుండా ఆత్మవిశ్వాసంతో ఫైనల్ మ్యాచ్ ఆడాలని మాస్టర్ భారత మహిళల జట్టుకు సూచించాడు. 'స్వేచ్ఛగా ఆడి ఉత్తమ ప్రదర్శన ఇవ్వండి. ఇదే మహిళల జట్టుకు నా సందేశం. ఎలాంటి ఒత్తిడినీ దరిచేరనీయకండి. బయటి విషయాల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా అంతా కలిసికట్టుగా ఉంటే చాలు. మహిళల జట్టు ప్రదర్శనను నేను గమనిస్తున్నాను. ఇప్పటికే వారంతా యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. టోర్నీ ఆరంభానికి ముందు నేను పలువురు మహిళా క్రికెటర్లను కలిశా. ట్రోఫీని భారత్కు తీసుకొస్తే గొప్పగా ఉంటుందని చెప్పా' అని సచిన్ గుర్తు చేసుకున్నాడు.