న్యూఢిల్లీ: ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విధ్వంసకర బ్యాట్స్మన్, ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ గ్లేన్ మ్యాక్స్వెల్ ప్రత్యర్థి జట్లను హెచ్చరించాడు. కెప్టెన్సీ బాధ్యతలను వదులుకున్న విరాట్ కోహ్లీకి రెక్కలొచ్చాయని, అతను బౌలర్లపై ఉప్పెనలా విరుచుకుపడతాడని అభిప్రాయపడ్డాడు. విరాట్ కోహ్లీ విషయంలో బౌలర్లు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని సూచించాడు. కెప్టెన్గా ఉన్న సమయంలోనే ప్రత్యర్ధి బౌలర్లను చెడుగుడు ఆడిన కోహ్లీ.. ఇప్పుడు ఆ భారాన్ని వదులుకొని ఆటగాడిగా మారిన తరుణంలో అతన్ని ఆపడం ఎవ్వరి తరం కాదన్నాడు.
'కెప్టెన్సీ ఒత్తిడి లేని కోహ్లీ, స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తూ మునుపటి కంటే ప్రమాదకారిగా మారి ప్రత్యర్ధులపై నిర్ధాక్షిణ్యంగా విరుచుకుపడతాడు. కోహ్లీ కెప్టెన్ కాకముందు ఎలా దూకుడుగా ఉండేవాడో, ఐపీఎల్ 2022 సీజన్లో అలానే చెలరేగుతాడు. మళ్లీ మనం ఆ పాత కోహ్లీని చూడబోతున్నాం. కోహ్లీలో ఈ మార్పు ప్రత్యర్ధి జట్లకు ఎంత మాత్రం మంచిది కాదు.'అని మ్యాక్సీ చెప్పుకొచ్చాడు. కాగా, మ్యాక్స్వెల్ గత సీజన్ (2021) నుంచే విరాట్ కోహ్లితో పాటు ఆర్సీబీకి ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ సీజన్కు కూడా అతన్ని ఆర్సీబీ రిటైన్ చేసుకుంది. గత ఐపీఎల్ సీజన్ వరకు ఉప్పు-నిప్పుగా ఉన్న ఈ ఇద్దరూ.. మ్యాక్స్వెల్ ఆర్సీబీలో చేరాక చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు.
ఐపీఎల్లో 11 ఏళ్ల పాటు ఆర్సీబీకి కెప్టెన్గా వ్యవహరించిన కోహ్లీ గత సీజన్తో ఆ భారాన్ని దించుకున్నాడు. ఈ 11 ఏళ్ల కాలంలో ఆర్సీబీని ఒక్కసారి కూడా టైటిల్ విజేతగా నిలపలేకపోయిన కోహ్లీ బ్యాటింగ్లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఐపీఎల్ 2016 సీజన్లో ఏకంగా నాలుగు సెంచరీలు బాదిన ఈ రన్ మెషీన్.. 973 పరుగులు చేసి ఒంటిచేత్తో జట్టుని ఫైనల్కి చేర్చాడు. అయితే తుది పోరులో సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో భంగపడటంతో ఆ జట్టు టైటిల్ కల కల్లగానే మిగిలిపోయింది. కోహ్లీ ఐపీఎల్ కెప్టెన్సీతో పాటు టీమిండియా సారథ్య బాధ్యతలను కూడా వదులుకున్న విషయం తెలిసిందే. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నా.. అతనికి కలిసిరాలేదు. శ్రీలంకతో ఇటీవల ముగిసిన రెండు టెస్ట్ల సిరీస్లో దారుణంగా విఫలమయ్యాడు.