ఇంటికెలా వెళ్లాలి:
ఐపీఎల్ 2021లో ఆడుతున్న మిగతా ఆస్ట్రేలియా ప్లేయర్స్ టోర్నీ ముగిసిన తర్వాత ఇంటికెళ్లాలా అన్న ఆలోచనలో పడ్డారు. అయితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్వెల్ ఇందుకు ఓ పరిష్కారం చూపించాడు. ఐపీఎల్ టోర్నీ ముగియగానే భారత్, న్యూజిలాండ్, ఇంగ్లండ్ ప్లేయర్స్తో కలిసి తాము కూడా యూకే వెళ్లిపోతామని.. అక్కడి నుంచి ఆస్ట్రేలియా వెళతామని తన మాస్టర్ ప్లాన్ గురించి తెలిపాడు. భారత్, న్యూజిలాండ్, ఇంగ్లండ్ ఆటగాళ్లను చార్టర్డ్ విమానంలో తీసుకెళ్తారని.. వాళ్లతో పాటే ఆసీస్ ప్లేయర్స్ను తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు చెప్పడం విశేషం.
మ్యాక్స్వెల్ మాస్టర్ ప్లాన్:
'ఐపీఎల్ 2021 అనంతరం ఏదో రకంగా ఇంటికి చేరుకుంటే చాలు. బీసీసీఐ, రెండు ప్రభుత్వాలు (భారత్, ఆస్ట్రేలియా) ఇందుకు ఓ పరిష్కారం చూపిస్తాయి. టోర్నీ ముగిసిన తర్వాత కూడా కొన్ని రోజులు వేచి చూడమంటే చూస్తాం. కానీ ఆ తర్వాతైనా ఇంటికి వెళ్లే దారి ఉంటే చాలు. భారత్, ఇంగ్లండ్ ఎలాగూ యూకే వెళ్తున్నాయి. వాళ్లతో పాటు వెళ్లి ఇంగ్లండ్లో కొన్ని రోజులు ఉంటాం. ఈ ప్లాన్కు మిగతా ప్లేయర్స్ కూడా సిద్ధంగానే ఉన్నారు' అని గ్లెన్ మ్యాక్స్వెల్ చెప్పాడు. ఐపీఎల్ 2020లో దారుణంగా విఫలమయిన మ్యాక్సీ.. ఈ సీజన్లో మాత్రం దుమ్మురేపుతున్నాడు. బెంగళూరు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
బీసీసీఐ సహాయం చేస్తుందని నమ్ముతున్నా:
'ఐపీఎల్ 2021 పూర్తయిన తర్వాత బయో బబుల్ దాటుతాం. ఇక్కడ ఇరుక్కోవడం నాకు ఇష్టం లేదు. భారత్ నుంచి వెళ్లిపోవడానికి సురక్షితమైన మార్గం ఇంకేదైనా ఉంటే ప్రయత్నించండి. నేను విన్నీ (కాబోయే సతీమణి)కి అన్ని విషయాలు చెప్పాను. సహాయం లేకపోతే ఏం చేస్తావని అడిగింది. విదేశీ ఆటగాళ్ల కోసం బీసీసీఐ ఖచ్చితంగా సహాయం చేస్తుందని అనుకుంటున్నా' అని మ్యాక్సీ చెప్పుకొచ్చాడు. ఆసీస్ ఆటగాళ్లను స్వదేశానికి తీసుకెళ్లడానికి ప్రత్యేక చార్టర్డ్ ఫ్లయిట్ ఏర్పాటు చేయాలని ముంబై ఇండియన్స్ స్టార్ ఓపెనర్ క్రిస్ లిన్.. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)ను వేడుకున్నా ఫలితం లేకపోయింది.
జూన్ 18 నుంచి టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్:
ఐపీఎల్ 2021 నుంచి భారత్, ఇంగ్లండ్తో పాటు న్యూజిలాండ్ ప్లేయర్స్ కూడా ఇంగ్లండ్ వెళ్లనున్నారు. జూన్ 18 నుంచి అక్కడ ఇండియా, న్యూజిలాండ్ మధ్య వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ జరగనుంది. దీంతో ఈ మూడు టీమ్స్తో పాటు ఆస్ట్రేలియా వాళ్లను కూడా పంపిస్తే బాగానే ఉంటుందని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ అన్నారు. ఇదే మంచి నిర్ణయం అని అందరూ అంటున్నారు. ఐపీఎల్ 2021 ఆడుతున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్వదేశానికి రావడానికి సొంతంగా ఏర్పాట్లు చేసుకోవాలని ఆ దేశ ప్రధాని స్కాట్ మోరిసన్ ప్రకటించిన విషయం తెలిసిందే.