హైదరాబాద్: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు ఇప్పటికే వన్డే సిరీస్ కోల్పోవడంతో.. ఇప్పుడు తొలి టెస్టు పరాజయాన్ని సైతం కూడదీసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాదు జట్టు వైఫల్యంలో కెప్టెన్ కోహ్లీని మినహాయించి మిగిలిన వారికి సూచనలిస్తున్నారు. వారిలో టీమిండియా సీనియర్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా చేరిపోయారు. భారత జట్టులో అందరూ విరాట్ కోహ్లీలుకారని.. అందుకే ఇంగ్లాండ్ పిచ్లపై వారికి ప్రాక్టీస్ అవసరమని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కి ముందు భారత జట్టుకి సరైన ప్రాక్టీస్ లభించకపోవడంతోనే తొలి టెస్టులో బ్యాట్స్మెన్లు విఫలమయ్యారని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. ఇంగ్లాండ్తో బర్మింగ్హామ్ వేదికగా శనివారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్లో భారత్ 31 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. అయితే తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో 149 పరుగులు చేసిన కోహ్లీ, రెండో ఇన్నింగ్స్లో 51 పరుగులు చేశాడు.
తొలి ఇన్నింగ్స్లో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అందరూ వెనుదిరిగినా టెయిలెండర్ల సాయంతో భారత జట్టును ముందుకు నడిపిన కోహ్లీపై సోషల్ మీడియా అంతటా ప్రశంసల వర్షం కురిసింది. 'టెస్టు సిరీస్కి ముందు భారత్ జట్టు కనీసం.. మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లు రెండైనా ఆడి ఉండాల్సి ఉంది. అలా ఆడింటే.. బంతి గమనాన్ని అంచనా వేయడంపై ఆటగాళ్లలో ఒక అవగాహన వచ్చేది. ఈ ఏడాది ఆరంభంలోనూ ఇలానే దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్కి ముందు వార్మప్ మ్యాచ్లను భారత్ రద్దు చేసుకుంది.'
'దీంతో.. తొలి రెండు టెస్టుల్లోనూ తడబడ్డారు. అయితే.. విరాట్ కోహ్లి మాత్రం ప్రాక్టీస్ లేకపోయినా రాణించగలుగుతున్నాడు. అఫ్గానిస్థాన్తో టెస్టుకి దూరమైన అతను దాదాపు 50 రోజుల తర్వాత మళ్లీ టెస్టు మ్యాచ్ ఆడాడు. అయినా.. సెంచరీ సాధించాడు. కానీ.. జట్టులోని మిగతా బ్యాట్స్మెన్కి ప్రాక్టీస్ అవసరం. ఆ విషయాన్ని టీమిండియా మేనేజ్మెంట్ గుర్తిస్తే మేలు' అని గవాస్కర్ సూచించాడు. ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కి ముందు భారత్ ఒక్క ప్రాక్టీస్ మ్యాచ్ మాత్రమే ఆడింది. రెండో టెస్టు మ్యాచ్ రానున్న గురువారం నుంచి జరగనుంది.