రిషభ్ పంత్ కొద్దిసేపు క్రీజులో ఉండి ఉంటే.. చారిత్రాత్మక విజయం దక్కేది: గౌతం గంభీర్

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్లో ధనాధన్ ఇన్నింగ్స్తో అలరించిన టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మన్ రిషభ్ పంత్పై మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు. పంత్ కొద్దిసేపు క్రీజులో ఉండి ఉండే భారత్కు చారిత్రాత్మక విజయం దక్కేదన్నాడు. సిడ్నీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో బ్యాటింగ్ ప్రమోషన్ అందుకున్న పంత్(97).. 12 ఫోర్లు 3 సిక్స్లతో విరవిహారం చేసిన విషయం తెలిసిందే. తృటిలో సెంచరీ చేజార్చుకున్నా.. మ్యాచ్ డ్రా కావడంలో కీలక పాత్ర పోషించాడు. తాజాగా స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో పంత్ ఇన్నింగ్స్పై మాట్లాడిన గంభీర్.. పొగడ్తలతో అతన్ని ఆకాశానికెత్తాడు.

రిషభ్ పంత్ గానీ..
'రిషభ్ పంత్ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతని బలాన్ని నమ్ముకుంటూ తనదైన సహజ పద్దతిలో చెలరేగాడు. ఔటవుతానని తెలిసినా రిస్కీ షాట్స్తో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అలాంటి షాట్స్ ఆడాల్సిన అవసరం లేదని చాలా మంది అనవచ్చు. కానీ అవేవి పట్టిచ్చుకోకుండా పంత్ తన శైలిలో విధ్వంసం సృష్టించాడు. అదే ఆటతో జట్టును ఒడ్డుకు చేర్చాడు. సిరీస్పై ఆశలను సజీవంగా ఉంచాడు. అతను కనుక ఇంకొద్దిసేపు క్రీజులో ఉండి ఉంటే భారత్ చారిత్రాత్మక విజయాన్ని అందుకునేది.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

పుజారా పుజారానే..
ఇక టీమిండియా నయావాల్ చతేశ్వర్ పుజారాను కూడా ఈ బీజేపీ ఎంపీ ప్రశంసించాడు. అందరూ అతని స్ట్రైక్రేట్ను ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పిస్తున్నా.. అతని ఆటే అదని, టెస్ట్ల్లో అతనిలాంటి ఆటగాళ్లు అవసరం ముఖ్యమని తెలిపాడు. టైమ్పాస్ చేస్తూ సెషన్ మొత్తం బ్యాటింగ్ ఆడటమే పుజారా కర్తవ్యమన్నాడు. 'పుజారా గురించి ఎప్పుడూ మాట్లాడినా అతని స్ట్రైక్రేట్ను ప్రస్తావిస్తారు. కానీ ప్రపంచ క్రికెట్లో ఓపికగా సెషన్ల పాటు బ్యాటింగ్ చేసే ఆటగాళ్లు అతి తక్కువ మంది. వారిలో పుజారా ఒకడు. ఇలాంటి ఆటతోనే టెస్ట్ల్లో ఓటమిని తప్పించుకోగలం. ఆస్ట్రేలియాలో ఇలాంటి డ్రాలు ఘన విజయాలతో సమానం'అని గంభీర్ స్పష్టం చేశాడు.

అద్భుత పోరాటం..
407 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్నైట్ స్కోరు 98/2తో ఆఖరి రోజు ఆట కొనసాగించిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 334 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (118 బంతుల్లో 97; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ చేజార్చుకోగా, చతేశ్వర్ పుజారా (205 బంతుల్లో 77; 12 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు.
అనంతరం హనుమ విహారి (161 బంతుల్లో 23 నాటౌట్; 4 ఫోర్లు), రవిచంద్రన్ అశ్విన్ (128 బంతుల్లో 39 నాటౌట్; 7 ఫోర్లు)ల మారథాన్ భాగస్వామ్యంతో మ్యాచ్ 'డ్రా'గా ముగిసింది. వీరిద్దరు 42.4 ఓవర్లపాటు క్రీజ్లో నిలిచి ఆరో వికెట్కు 62 పరుగులు జోడించారు. మూడో టెస్టు డ్రా కావడంతో సిరీస్ 1-1తో సమంగా ఉన్న సంగతి తెలిసిందే. జనవరి 15 నుంచి బ్రిస్బేన్ వేదికగా నాలుగో టెస్ట్ ఆడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications