హైదరాబాద్: ఇంగ్లాండ్ గడ్డపై పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీపై విమర్శలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ 'ఫినిషర్'పై సోషల్ మీడియా వేదికగా అభిమానులు విరుచుకుపడుతుండగా.. సునీల్ గవాస్కర్ లాంటి దిగ్గజ క్రికెటర్ సైతం పరోక్షంగా విమర్శలు గుప్పించాడు. తాజాగా ఈ జాబితాలో భారత వెటరన్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ చేరాడు.
సుదీర్ఘకాలంగా ధోనీతో పొసగని ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్న గంభీర్.. ఈ మాజీ కెప్టెన్ కారణంగానే ప్రస్తుతం జట్టుపై ఒత్తిడి పెరుగుతోందని వ్యాఖ్యానించాడు. 'ఇంగ్లాండ్ గడ్డపై ఇటీవల ముగిసిన మూడు వన్డేల్లోనూ ధోనీ ఆటని ఓసారి పరిశీలిస్తే.. అతను చాలా డాట్బాల్స్ ఆడినట్లు స్పష్టంగా తెలుస్తోంది. జట్టు కష్టాల్లో నిలిచిన దశలో అతను అలా ఆడటంతో.. మిగతా బ్యాట్స్మెన్పై విపరీతంగా ఒత్తిడి పెరుగుతోంది. అతను బ్యాటింగ్లో చురుగ్గా వ్యవహరించాల్సి ఉంది' అని గంభీర్ వెల్లడించాడు.
జట్టులో ఉన్నప్పటి నుంచీ ధోనీకి గంభీర్కి పెద్దగా సఖ్యత ఉండకపోవడంతో ఈ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకుంటున్నారు ధోనీ అభిమానులు. అంతకుముందు మూడో వన్డేలో ధోనీ తెల్లటి గడ్డంతో మ్యాచ్ ఆడుతున్నందుకు కూడా గంభీర్ విమర్శలకు దిగాడు. అసలు వయస్సు కంటే పదేళ్లు పెద్దోడిలా కనిపిస్తున్నాడంటూ ఘాటుగా విమర్శించాడు.
ఇంగ్లాండ్తో మూడో వన్డే ముగిసిన తర్వాత.. అంపైర్ల వద్ద నుంచి బంతిని ధోనీ గుర్తుగా తీసుకోవడంతో ఈ మాజీ కెప్టెన్ రిటైర్మెంట్ తీసుకోబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. కానీ.. 2019 ప్రపంచకప్లో ధోనీ ఆడతాడని గత ఏడాదే భారత చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ప్రకటించిన విషయం తెలిసిందే.