హైదరాబాద్: ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు వరుస పరాజయాలకు నైతిక బాధ్యత వహిస్తూ గౌతమ్ గంభీర్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ యాజమాన్యం జట్టులోని యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్కు సారథ్య బాధ్యతలు అప్పగించింది.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
తనను కెప్టెన్సీ నుంచి దిగిపోవాలని ఎవరూ బలవంతం చేయలేదని ఒత్తిడి కారణంగానే సారథ్యానికి దూరమవుతున్నానని గంభీర్ వెల్లడించాడు. అయితే గంభీర్ నాయకత్వానికి దూరమైనంత మాత్రాన ఢిల్లీ పరిస్థితి మారదని మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.
అంతేకాదు ఢిల్లీకి గంభీర్ లాంటి సమర్ధవంతమైన నాయకుడి అవసరముందని, గంభీర్ను జట్టు సారథ్య బాధ్యతల నిర్వహణకే ఫ్రాంచైజీ కొనుగోలు చేసిందని మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు. 'గంభీర్ నాయకత్వమే సమస్యని నేను అనుకోను. జట్టులోని తన సహచర ఆటగాళ్ల పేలవ ప్రదర్శనలతో ఢిల్లీ ఆరు మ్యాచ్లలో ఐదింటిని కోల్పోయింది' అని అన్నాడు.
'జట్టును ముందుండి నడిపించాల్సింది కెప్టెనే. మ్యాక్స్వెల్ వంటి సీనియర్లు విఫలమవ్వడం మిగతా బ్యాట్స్మెన్ పరుగులు చేయకపోవడమే అసలు కారణం. మిగతా ఆటగాళ్ల నుంచి సహకారం లభించక పోవడంతో అతనిపై ఒత్తిడి పెంచుతోంది. దాంతో గంభీర్ కూడా తన ఆటపట్ల శ్రద్ధ పెట్టలేక పోయాడు' అని మంజ్రేకర్ పేర్కొన్నాడు.
'వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న జట్టులో మార్పులు చేయాలనుకోవడం మంచి పనే. అయితే, ఇక్కడ ఢిల్లీ సమస్య నాయకత్వం కాదు. ఆ జట్టులో సమూల మార్పులు జరగాలి. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉండి చివరి మ్యాచ్లో స్పల్ప లక్ష్యాన్ని ఛేదించనప్పుడే ఇలాంటి అవసరం ఏర్పడుతుంది' అని అన్నాడు.
'అయితే, కొత్త కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ వచ్చినంత మాత్రాన ఢిల్లీ దూసుకుపోతుందని చెప్పలేం. అందరి సమష్టి కృషి ఫలితమే వారికి విజయాలను తెచ్చిపెడుతుంది. ఇక, బౌలింగ్ పరంగా కూడా ఢిల్లీ ట్రెంట్బౌల్ట్పై ఆధారపడినంత వరకు మార్పేమీ ఉండబోదు' అని మంజ్రేకర్ స్పష్టం చేశాడు.