టీమిండియా టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన తొలి ఓటమిని చవిచూశాడు. శ్రీలంకతో పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో అతని సారధ్యంలోని టీమిండియా ఓటమి చవిచూసింది. ఇప్పటి వరకు భారత జట్టు సారధిగా అతను ఆడిన టీ20ల్లో ఇదే మొదటి ఓటమి కావడం గమనార్హం. ఈ క్రమంలోనే కెప్టెన్గా హార్దిక్ పద్ధతి ఎలా ఉంది? అనే ప్రశ్న తలెత్తింది. దీనికి మాజీ లెజెండ్, టీమిండియా మాజీ సారధి గౌతమ్ గంభీర్ బదులిచ్చాడు.
పాండ్యా కెప్టెన్సీ చాలా బాగుందని చెప్పిన గంభీర్.. ఇలా ప్రతి మ్యాచ్ తర్వాత అతని కెప్టెన్సీని ప్రశ్నించడం పద్ధతి కాదన్నాడు. 'ఇప్పటి వరకు అతను చాలా చక్కగా కెప్టెన్సీ చేశాడు. ప్రతి మ్యాచ్ తర్వాత ఆటగాళ్లను జడ్జ్ చేయడం సరికాదు. భారత జట్టు ఒక మ్యాచ్ ఓడిపోయిందంటే.. అతనేదో తప్పు చేసినట్లు కాదు. బౌలర్లు నోబాల్స్ వేయకుండా కెప్టెన్ ఆపలేడు. అది బౌలర్ బాధ్యత' అని చెప్పాడు. ఈ మ్యాచ్లో టీమిండియా యువపేసర్ అర్షదీప్ సింగ్ కేవలం రెండు ఓవర్లే బౌలింగ్ చేశాడు. వీటిలో ఐదు నోబాల్స్ వేయడంతో పాటు భారీగా పరుగులు సమర్పించుకున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతానికైతే పాండ్యా తన కెప్టెన్సీ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తున్నాడని గంభీర్ అభిప్రాయపడ్డాడు. 'ఇప్పటి వరకు ఎన్నిసార్లు జట్టుకు కెప్టెన్సీ చేసినా.. అతను రాణించాడు. మైదానంలో చాలా రిలాక్స్డ్గా కనిపిస్తున్నాడు. అదే సమయంలో ఎగ్రెసివ్గా ఆడుతున్నాడు. అతని మైండ్ సెట్ అలాంటిదే. తన ఆటగాళ్లకు మద్దతుగా నిలబడుతున్నాడు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు చాలా ఇంపార్టెంట్. అన్ని అంశాలు రిలాక్స్డ్గా ఉండేలా చూసుకుంటున్నాడు కూడా' అని మెచ్చుకున్నాడు. అదే సమయంలో హార్దిక్ ఇంకా చాలా నేర్చుకోవాలని, అనుభవం వచ్చే కొద్దీ అతను మరింత మెరుగైన నాయకుడిగా ఎదుగుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.