టీమిండియా సెలెక్టర్లు, కోచ్ రాహుల్ ద్రావిడ్పై మాజీ లెజెండ్, దిగ్గజ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మండిపడ్డాడు. వాళ్లెవరూ తాము చేయాల్సిన పని చేయడం లేదని విమర్శించాడు. డ్యాషింగ్ ఓపెనర్ పృథ్వీ షా టీమిండియాకు సెలెక్ట్ అవుతాడని చాలా కాలంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. కానీ సెలెక్టర్లు మాత్రం అతనికి మొండి చెయ్యి చూపుతూనే వస్తున్నారు. దేశవాళీల్లో పృథ్వీ షా అదరగొట్టినా కూడా అతనికి ఛాన్స్ ఇవ్వడం లేదు.
ఇదే విషయాన్ని గౌతమ్ గంభీర్ ఎత్తి చూపాడు. షా ఎంతటి ట్యాలెంట్ ఉన్న ఆటగాడో అందరికీ తెలిసిందే అన్న గంభీర్.. అలాంటి ఆటగాడిని జట్టులోకి తీసుకొని, సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత టీం మేనేజ్మెంట్ మీదనే ఉంటుందన్నాడు. కోచ్ పని కేవలం ఆటగాళ్లకు ప్రాక్టీస్లో త్రో డౌన్స్ వేయడం, వాళ్లను మ్యాచ్కు రెడీ చేయడమే కాదంటూ ద్రావిడ్పై పరోక్షంగా విమర్శలు చేశాడు. అండర్-19 క్రికెట్ టీంకు ద్రావిడ్ కోచ్గా ఉన్నప్పుడు ఆ జట్టుల పృథ్వీ షా రాణించాడు. వీళ్లిద్దరి మధ్య సత్సంబంధాలు కూడా ఉన్నాయి. ట్యాలెంట్ ఉన్న అలాంటి ఆటగాళ్లకు మద్దతుగా నిలుస్తూ.. మెరుగైన ఆటగాళ్లుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత టీం మేనేజ్మెంట్కు ఉంటుందని గంభీర్ అన్నాడు.
2019లో పృథ్వీ షా భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. అతని ట్యాలెంట్ చూసిన వాళ్లంతా భారత క్రికెట్లో అతను మరో సంచలనంగా మారతాడని అనుకున్నారు. అయితే ఆ తర్వాత ఫామ్ కోల్పోవడం, డోపింగ్ టెస్టులో విఫలమవడంతో పృథ్వీ షా కెరీర్ గ్రాఫ్ పడిపోయింది. వీటన్నింటి నుంచి తేరుకున్న అతను మళ్లీ బ్యాటుతో రాణిస్తున్నా.. భారత జట్టులో మాత్రం చోటు దొరకడం లేదు. టీ20 వరల్డ్ కప్లో టీమిండియాకు పేలవమైన ఓపెనింగ్లు లభించిన ప్రతిసారీ ఎవరో ఒకరు పృథ్వీ షాను తలచుకుంటూనే వచ్చారు. అతను ఉంటే అదిరిపోయే ఓపెనింగ్లు ఇచ్చేవాడని అన్నారు. సీనియర్లకు విశ్రాంతి ఇచ్చిన శ్రీలంక సిరీస్లో కూడా పృథ్వీ షాను ఎంపిక చేయకపోవడం తెలిసిందే.