అప్పుడు కాలుష్యం.. ఇప్పుడు మహా:
గురువారం రాజ్కోట్ వేదికగా రెండో టీ20 జరగాల్సి ఉంది. అయితే గత కొద్ది రోజులుగా మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో సైక్లోన్ 'మహా' కారణంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో రెండో టీ20కి తుఫాన్ ముప్పు పొంచి ఉంది. మ్యాచ్ జరిగే రోజు సౌరాష్ట్రలో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో ఢిల్లీ టీ20 లాగే ఈ మ్యాచ్పై ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో సౌరాష్ట్ర క్రికెట్ సంఘం స్పందించింది.
మ్యాచ్ నిర్వహిస్తాం:
'ఇక్కడి వాతావరణ పరిస్థితులను నిరంతరం గమనిస్తున్నాం. మ్యాచ్ నిర్వహించేందుకు మేం సంసిద్ధంగా ఉన్నాం. అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. నవంబర్ 7న ఉదయం వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. అయితే మ్యాచ్ మాత్రం సాయంత్రం 7 గంటలకు మొదలవుతుంది. అప్పటికి ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచాం' అని సౌరాష్ట్ర క్రికెట్ సంఘం అధికారి ఒకరు తెలిపారు.
వర్షం పడినా స్టేడియాన్ని సిద్ధం చేయగలం:
'బుధవారం ఉదయం వరకు సైక్లోన్ ప్రభావం తీవ్రంగా ఉండి ఆ తర్వాత బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పుడైతే మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచాం. మ్యాచ్ జరిగే రోజు ఉదయం వర్షం పడినా తక్కువ సమయంలోనే మ్యాచ్ నిర్వహణకు స్టేడియాన్ని సిద్ధం చేయగలం' అని సౌరాష్ట్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడు జయ్దేవ్ షా పేర్కొన్నాడు.
సిరీస్ ఆధిక్యంలో బంగ్లా:
మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో భారత్పై ఘన విజయం సాధించింది. దీంతో భారత్పై బంగ్లా తొలి టీ20 విజయాన్ని అందుకుని 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రాజ్కోట్లో కూడా గెలిచి సిరీస్ను దక్కించుకోవాలని బంగ్లా చూస్తుంటే.. విజయం సాధించి సిరీస్ను సమం చేయాలని భారత్ భావిస్తోంది.