దేవ్దత్ పడిక్కల్(7 మ్యాచ్ల్లో 243)
ఆరంగేట్ర మ్యాచ్లోనే హాఫ్ సెంచరీతో అందరి దృష్టిని ఆకర్షించిన దేవదత్ పడిక్కల్ అదే జోరును కొనసాగిస్తున్నాడు. 7 మ్యాచ్ ల్లో 3 హాఫ్ సెంచరీలతో 243 పరుగులు చేసి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అటు ఫీల్డింగ్లోనూ అదరగొడుతున్నాడు. ఓపెనర్గా జట్టుకు మంచి శుభారంభాలనందిస్తున్నాడు. కేరళలో జన్మించి కర్ణాటక జట్టుకు ఆడే 20 ఏళ్ల దేవ్దత్ గత దేశవాళీ సీజన్లో వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ, టీ20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీ రెండింటిలో కూడా టాప్ స్కోరర్గా నిలిచాడు. ముస్తాక్ అలీ టోర్నీలోనైతే ఏకంగా 175.75 స్ట్రయిక్ రేట్తో అతను 580 పరుగులు సాధించాడు. అదే జోరును అరబ్ గడ్డపై కొనసాగిస్తున్నాడు.
రియాన్ పరాగ్..(5 మ్యాచ్ల్లో 65)
స్పిన్ ఆల్రౌండర్ అయిన 18 ఏళ్ల రియాన్ పరాగ్.. ఒకే ఒక మ్యాచ్తో అందరి దృష్టిని ఆకర్షించాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో టాపార్డర్ విఫలమైన వేళ.. సహచర ఆటగాడు రాహల్ తెవాటియాతో కలిసి జట్టుకు అద్భుత విజయాన్నందించాడు. క్లిష్ట పరిస్థితుల్లో 42 పరుగులతో నాటౌట్గా నిలిచి విన్నింగ్ షాట్తో మ్యాచ్ను ముగించాడు. ఆ వెంటనే తనదైన సెలెబ్రేషన్తో ఆకట్టుకున్నాడు. అస్సామి బిహు డ్యాన్స్ చేస్తూ ఔరా అనిపించాడు. ఆ స్టేట్కే చెందిన రియాన్.. ఆ రాష్ట్ర రంజీ టీమ్తో పాటు భారత అండర్-19 జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో తనదైన పెర్ఫామెన్స్ కనబర్చాడు.
అబ్దుల్ సమద్/ప్రియామ్ గార్గ్
జమ్మూ కశ్మీర్కు చెందిన 19 ఏళ్ల సమద్ను ప్రతిభాన్వేషణలో భాగంగా స్వయంగా వీవీఎస్ లక్ష్మణ్ ఎంపిక చేశాడు. గత సీజన్లో అద్భుత బ్యాటింగ్తో రంజీ మ్యాచ్లో పటిష్ట కర్ణాటకపై చెలరేగి అందరి దృష్టిలో పడ్డాడు. అతనిపై టీమ్మేనేజ్మెంట్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఎక్కువ అవకాశాలు రాకున్నా.. ఆడిన నాలుగు మ్యాచ్ల్లో తనవంతు పాత్ర పోషించాడు. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఆఖరి ఓవర్లో బౌలింగ్ చేసి కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. చివర్లో ధాటిగా ఆడగలడనే నమ్మకాన్ని కలిగించాడు. భారత అండర్-19 కెప్టెన్ ప్రియమ్ గార్గ్ కూడా హైదరాబాద్ తరఫున 7 మ్యాచ్లు ఆడి 5 ఇన్నింగ్స్ల్లో 86 పరుగులు చేశాడు. ఇందులో ఓ హాఫ్ సెంచరీ ఉంది. అది కూడా మ్యాచ్ విన్నింగ్ పెర్ఫామెన్స్. టాపార్డర్ విఫలమైన వేళ అద్భుత బ్యాటింగ్తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక అండర్-19 కెప్టెన్గా భారత జట్టును ఫైనల్కు చేర్చిన విషయం తెలిసిందే. దేశవాళీ క్రికెట్లోనూ రాణించాడు.
రవి బిష్ణోయ్ (7 మ్యాచ్ల్లో 8 వికెట్లు)
అండర్-19 ప్రపంచకప్లో అత్యంత ప్రభావం చూపించిన లెగ్ స్పిన్నర్ రవి బిష్టోయ్.. ఐపీఎల్లో కూడా తన జోరును కొనసాగించాడు. కింగ్స్ పంజాబ్ కీలక స్పిన్నర్గా సేవలందిస్తున్నాడు. 7 మ్యాచ్ల్లో 8 వికెట్లు తీసాడు. ముఖ్యంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో(3/32) మూడు వికెట్లతో చెలరేగాడు. అయితే జట్టు అనూహ్య ఓటములతో అతని ప్రతిభకు గుర్తింపు దక్కలేదు. రాజస్తాన్కు చెందని 20 ఏళ్ల రవి బిష్ణోయ్ గుగ్లీలు ఎంత పెద్ద బ్యాట్స్మెన్నైనా ఇబ్బంది పెడతాయనేది సీనియర్ క్రికెటర్ల మాట. పంజాబ్ తుది జట్టులో కృష్ణప్ప గౌతమ్, అశ్విన్ మురుగన్ కాదని అవకాశం అందుకుంటున్నాడు. టీమ్ కోచ్గా లెగ్ స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే ఉండటంతో అతని మార్గనిర్దేశనంలో రవి మరింతగా రాటుదేలుతాడు.
ఇక భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన దేశవాళీ కుర్రాళ్లు యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయారు. మూడు మ్యాచ్లు ఆడిన యశస్వీ 40 పరుగులు చేయగా.. రెండు మ్యాచ్లు ఆడిన రుతురాజ్ 5 పరుగులు మాత్రమే చేశాడు. దేశవాళీ క్రికెట్ లో ఈ ఇద్దరు సంచలన ప్రదర్శన కనబర్చారు.