India vs Australia: ఆ లోటే కోహ్లీసేన వన్డే సిరీస్ ఓటమికి కారణమా?

హైదరాబాద్: ఎన్నో అంచనాల మధ్య ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు పేలవ ఆటతీరుతో తీవ్రంగా నిరాశపరిచింది. మూడు వన్డేల సిరీస్లో వరుసగా రెండింటిలో ఓడి 2-1తో సిరీస్ చేజార్చుకుంది. ఆఖరి వన్డేలో గెలిచినా.. భారత్ ఓడిన తీరు మాత్రం అందర్నీ విస్మయానికి గురి చేసింది. అయితే వన్డే సిరీస్లో భారత వైఫల్యానికి ప్రధాన కారణం.. కోహ్లీ వ్యూహాలు బెడిసి కొట్టడమేనని విశ్లేషకులు అభిప్రాయం. అలాగే ఆల్రౌండ్ నైపుణ్యం గల ఆటగాళ్లు జట్టులో లేకపోవడం, బౌలింగ్ వైఫల్యం, చెత్త ఫీల్డింగ్ కూడా జట్టు విజయవకాశాలను దెబ్బతీసింది. 'భారత బ్యాట్స్మెన్ బౌలింగ్ చేయలేరు...భారత బౌలర్లు బ్యాటింగ్ చేయలేరు'.. ఆస్ట్రేలియా చేతిలో సిరీస్ పరాజయంలో భారత కూర్పు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వ్యాఖ్య సరిపోతుంది. ముఖ్యంగా విదేశీ గడ్డపైనే రెండు సిరీస్ పరాజయాలు ఎదురయ్యాయి. ఈ సిరీస్ను కోల్పోవడానికి కొన్ని కారణాలను విశ్లేషిస్తే..

ఆల్రౌండర్ల లోటు..
రెండో వన్డేలో హార్దిక్ పాండ్యాతో బలవంతంగా బౌలింగ్ చేయించినా... ప్రస్తుతానికి అతను పూర్తి స్థాయి బ్యాట్స్మన్గానే ఆడుతున్నాడు. బ్యాట్స్మన్ అయి ఉండి కొంత బౌలింగ్ చేయగలిగే విజయ్ శంకర్, దూబే, కృనాల్, జాదవ్లాంటి వారితో ఎన్ని ప్రయత్నాలు చేసినా భారత్ వన్డేల్లో సఫలం కాలేకపోతోంది. ఒకదశలో సచిన్, యువరాజ్, సెహ్వాగ్, రైనా అవసరమైతే ఏ క్షణానైనా బౌలింగ్కు సిద్ధంగా ఉండేవారు. ఇప్పటి మన టాప్-5లో ఒక్కరూ కనీసం ఒక్క బంతి కూడా వేయడం లేదు. మరో కోణంలో చూస్తే ‘త్రో డౌన్ స్పెషలిస్ట్'ల కారణంగా నెట్స్లో మన బ్యాట్స్మెన్ ఎవరికీ బౌలింగ్ చేయాల్సిన అవసరం గానీ అవకాశం గానీ ఉండటం లేదు.

చేతులెత్తేసిన బౌలర్లు
ఈ ఏడాది ఆడిన 9 వన్డేల్లో కలిపి భారత్ బౌలర్లు తొలి 10 ఓవర్ల పవర్ప్లేలో కేవలం 4 వికెట్లే పడగొట్టగలిగారు. ముఖ్యంగా గాయంతో భువనేశ్వర్ కుమార్ దూరం కావడం జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది. సీనియర్లు షమీ, బుమ్రా కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోగా... అనుభవం లేని నవదీప్ సైనీ సహజంగానే విఫలమయ్యాడు. ఆసీస్తో రెండు మ్యాచ్ల్లోనూ మన పేసర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఇక కుల్దీప్-చహల్ ద్వయా న్ని బలవంతంగా టీమ్ విడగొట్టాల్సి వచ్చింది. కుల్దీప్-చహల్ కలిసి 27 మ్యాచ్లు ఆడితే భారత్ 20 గెలవడం దీనికి మంచి ఉదాహరణ. బ్యాటింగ్ మరీ బలహీనంగా మారిపోతుండటంతో జడేజాను తీసుకు రావాల్సి వచ్చింది.

రోహిత్ శర్మ లేకపోవడం...
కీలక ఆస్ట్రేలియా సిరీస్లో స్టార్ బ్యాట్స్మన్ రోహిత్ శర్మ ఆడకపోవడం మాత్రం కచ్చితంగా జట్టుకు లోటే. శిఖర్ ధావన్కు సరి జోడిగా ఉండే రోహిత్తో పోలిస్తే మయాంక్, శుభ్మన్ గిల్ల అనుభవం చాలా చాలా తక్కువ. తొలి రెండు వన్డేల్లో కూడా భారీ లక్ష్యాలను ఛేదించే సమయంలో రోహిత్ శర్మ ఉండి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో. వన్డేల్లో అతని అద్భుత రికార్డు, ఆస్ట్రేలియాపై గత ప్రదర్శనను చూస్తే రోహిత్ విలువేమిటో అర్థమవుతుంది. అతని గైర్హాజరీ జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది.

విజయంతో ముందుకెళ్లెనా..
తప్పిదాల నుంచి గుణపాఠం నేర్చుకున్న భారత జట్టు చివరి మ్యాచ్లో సమష్టిగా రాణించి విజయాన్నందుకుంది. ముఖ్యంగా రెండు వన్డేల్లో తేలిపోయిన బుమ్రా తన అసలు సత్తాను కీలక సమయంలో చూపించాడు. ఆసీస్ విజయానికి చేరువైన దశలో అద్భుత బంతితో మ్యాక్స్వెల్ వికెట్ తీసి జట్టుకు గెలుపు బాట పరిచాడు. ఆరు, ఏడు స్థానాల్లో ఆడే ఆల్రౌండర్లు బ్యాటింగ్లో ఎంత బలంగా ఉండాలో పాండ్యా, జడేజా భాగస్వామ్యం చూపించింది. ముఖ్యంగా ఎంతో నమ్మకం పెట్టుకున్న జడేజా అర్ధ సెంచరీ విజయానికి పనికొచ్చింది. ఇక రెండు కీలక మార్పులు కూడా టీమ్ను విజయంవైపు నడిపించాయి. చహల్ స్థానంలో వచ్చిన కుల్దీప్, సైనీకి బదులుగా బరిలోకి దిగిన శార్దుల్ రాణించి ఆసీస్ను ఒత్తిడిలో పడేశారు. ఈ గెలుపు ఉత్సాహాన్ని టీ20 సిరీస్లో కొనసాగిస్తారో లేదో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications