|
పాకిస్థాన్లో జన్మించిన కపిల్ దేవ్
1959 జనవరి 6న రాంలాల్ నిఖంజ్, రాజ్ కుమారీలు దంపతులకు కపిల్ దేవ్ జన్మించారు. కపిల్ జన్మించింది పాకిస్తాన్లోని రావల్పిండి సమీపంలోని ఒక గ్రామం. అయితే దేశ విభజన సమయంలో వారి కుటుంబం భారత్కు వలస వచ్చి చండీగడ్లో స్థిరపడింది. తండ్రి రాంలాల్ భవనాలు, కలప వ్యాపారంలో రాణించాడు. డి.ఏ.వి.కళాశాలలో విద్యనభ్యసించిన కపిల్ దేవ్కు 1979లో రోమీ భాటియా పరిచయం అయింది. 1980లో ఆమెను వివాహం చేసుకున్నాడు. 1996లో కపిల్ దంపతులకు అమియాదేవ్ అనే కూతురు జన్మించింది.
ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్
దేశవాళీ క్రికెట్లో అదరగొట్టిన కపిల్ దేవ్ 1978లో భారత జట్టులో అడుగుపెట్టారు. అక్టోబర్ 1న పాకిస్థాన్తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టారు. అదే నెలలో 16న పాకిస్థాన్తో కెరీర్లో తొలి టెస్టు మ్యాచ్ ఆడారు. అక్కడి నుంచి భారత క్రికెట్ జట్టులో మంచి పేస్ ఆల్రౌండర్గా స్థిరపడిపోయారు.
కరాచీలో జరిగిన ఆ సిరీస్లోని మూడో టెస్టులో 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. తద్వారా టెస్టు క్రికెట్లో వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన భారత బ్యాటర్గా రికార్డు సృష్టించాడు. వెస్టీండీస్ జట్టుపై ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో 124 బంతుల్లోనే 126 పరుగులు తన కెరీర్లో తొలి టెస్ట్ శతకాన్ని సాధించారు.
కపిల్ దేవ్ రికార్డులు
1983 ప్రపంచకప్లో భారత్కు నాయకత్వం వహించిన కపిల్దేవ్ జట్టును విశ్వవిజేతగా నిలిపాడు. భారత్కు తొలి ప్రపంచకప్ అందిచడంతోపాటు వరల్డ్ కప్ టోర్నమెంట్లలో వెస్టిండీస్ వరుస విజయాలకు బ్రేక్ వేశాడు. నాడు కపిల్దేవ్ నాయకత్వంలో భారత జట్టు సాధించిన విజయంతో దేశంలో క్రికెట్ దశ మారిపోయింది. యువత క్రికెట్ పట్ల అమితమైన ఆసక్తి పెంచుకున్నారు.
ఈ క్రమంలో టెస్టు క్రికెట్లో 5 వేల పరుగులు చేయడంతో 400కు పైగా వికెట్లు పడగొట్టిన తొలి ఆల్రౌండర్గా కపిల్ దేవ్ చెరగని రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా వన్డే క్రికెట్లో భారత జట్టు తరఫున సెంచరీ నమోదు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. మొత్తం 17 సంవత్సరాలపాటు భారత క్రికెట్కు ఎంతో సేవ చేశాడు.
1994లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోల్ ప్రకటించాడు. తన చివరి టెస్టు మ్యాచ్ను 1994లో మార్చి 19న న్యూజిలాండ్తో ఆడాడు. ఇక చివరి వన్డే మ్యాచ్ను 1994 అక్టోబర్ 17న వెస్టిండీస్తో ఆడాడు. మొత్తంగా తన టెస్టు కెరీర్లో 131 టెస్టు మ్యాచ్లు ఆడి 31 సగటుతో 5248 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
అత్యధిక స్కోర్ 163 పరుగులు. అదే సమయంలో 434 వికెట్లు పడగొట్టాడు. ఓ మ్యాచ్లో అత్యధికంగా 11 వికెట్లు తీశాడు. ఓ ఇన్నింగ్స్లో 9 వికెట్లు తీశాడు. ఇక 225 వన్డే మ్యాచ్ల్లో 23 సగటుతో 3783 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అదే సమయంలో 253 వికెట్లు పడగొట్టాడు. అత్యధికంగా ఓ ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీశాడు. మొత్తంగా తన కెరీర్లో 356 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడి, 9,031 పరుగులు చేయడంతోపాటు 687 వికెట్లు తీశాడు. రిటైర్ అయ్యాక కొంత కాలం భారత జట్టుకు కోచ్గా కూడా పని చేశాడు.
కపిల్దేవ్కు దక్కిన పురస్కారాలు
1980లో అర్జున అవార్డు, 1982లో పద్మశ్రీ అవార్డు, 1983లో విజ్డేన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, 1991లో పద్మ విభూషణ్ అవార్డు, 2002లో విజ్డెన్ ఇండియన్ క్రికెటర్ ఆఫ్ ది సెంచరీ, 2013లో కల్నల్ సీకే నాయుడు జీవిత సాఫల్య పురస్కారాన్ని కపిల్దేవ్ అందుకున్నారు. ప్రస్తుతం క్రికెట్ విశ్లేషకుడిగా రాణిస్తున్నారు.