ఉపఖండం పిచ్లు స్పిన్నర్లకు స్వర్గధామాలు
నిజానికి ఉపఖండం పిచ్లు స్పిన్నర్లకు స్వర్గధామాలు. అప్పటి ఎర్రాపల్లి ప్రసన్న, బిషన్ సింగ్ బేడీ, శ్రీనివాస్ వెంకట రాఘవన్ నుంచి నేటి అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాల వరకు టెస్టుల్లో అద్భుతమైన బౌలింగ్ రికార్డులను నమోదు చేశారు. అలాంటిది కోల్కతా టెస్టులో భారత స్పిన్నర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. అంతేకాదు స్వదేశంలో జరిగిన ఓ టెస్టు మ్యాచ్లో భారత స్పిన్నర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోడవం ఇదే తొలిసారి.
ఈడెన్ పిచ్ గతంలో బ్యాటింగ్కు అనుకూలం
గతంలో బ్యాటింగ్కు అనుకూలంగా ఉండే ఈడెన్ గార్డెన్స్ పిచ్ను గంగూలీ బౌలర్లకు అనుకూలంగా మార్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిచ్ అనుకూలత స్పిన్నర్ల కంటే పేసర్లకే ఎక్కువగా ఉపయోపడింది. వచ్చే ఏడాది కోహ్లీసేన వరుసగా దక్షిణాఫ్రికాతో పాటు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్లలో బౌన్సీ పిచ్లు కావడంతో అందుకు సన్నాహకంగా ఈడెన్ పిచ్ను తీర్చిదిద్దారు.
గంగూలీ తీసుకున్న ఓ నిర్ణయం
దీంతో గంగూలీ తీసుకున్న ఈ నిర్ణయం సిరీస్లో భారత్ ఆధిక్యం సాధించేందుకు అవకాశం లేకుండా చేసింది. మరోవైపు మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగే చివరి రెండు టెస్టులు జరిగే నాగ్పూర్, ఢిల్లీ పిచ్లు కూడా పేసర్లకు అనుకూలించే అవకాశం ఉంది. సిరిస్లో భాగంగా నవంబర్ 24న నాగ్పుర్లో జరిగే రెండో టెస్టుతో పాటు డిసెంబర్ 2న ఢిల్లీలో జరిగే మూడో టెస్టులో పేసర్లు చెలరేగే అవకాశం ఉంది.
పచ్చికతో కళకళలాడుతోన్న నాగ్పూర్ పిచ్
రెండో టెస్టు జరిగే నాగ్పూర్ పిచ్ పచ్చికతో కళకళలాడుతోంది. తొలి మూడు రోజుల్లో పిచ్ నుంచి స్పిన్నర్లకు సహకారం అందకపోవచ్చని.. ఆఖరి రెండు రోజుల్లో బంతి తిరిగే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. చివరి టెస్టు జరిగే ఫిరోజ్షా కోట్లాలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని అంటున్నారు.
బౌలర్లు పేస్ పిచ్లను ఎదుర్కోవాలనేది మేనేజ్మెంట్ వ్యూహం
వచ్చే 18 నెలల్లో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనలు ఉన్న నేపథ్యంలో తాజా సిరీస్లో భారత బౌలర్లు పేస్ పిచ్లను ఎదుర్కోవాలనేది జట్టు మేనేజ్మెంట్ వ్యూహంలో భాగం. ఇదే విషయాన్ని భారత జట్టు బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ వెల్లడించాడు. 'భారత ఆటగాళ్లు ఇక సులభమైన పరిస్థితుల్లో ఆడాలని అనుకోవట్లేదు. సవాళ్లను ఎదుర్కోవడానికి జట్టులో అందరూ సిద్ధంగా ఉన్నారు' అన్నాడు.