న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ చాలా సరదా మనిషి. సోషల్ మీడియా వేదికగా యాక్టివ్గా ఉండే ఈ సిక్సర్ల సింగ్ సహచర ఆటగాళ్లపై తరుచూ ఫన్నీ కామెంట్స్ చేస్తూ నవ్వులు పూయిస్తుంటాడు. అయితే తాజాగా యువీనే వారి కుటుంబ సభ్యుల చేత బకరా అయ్యాడు. కరోనా కారణంగా పూర్తిగా ఇంటికే పరిమితమైన యువీ.. సోషల్ మీడియా వేదికగా కాలక్షేపం చేస్తున్నాడు. ఆన్లైన్ వేదికగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ఆసక్తికర విషయాలు వెల్లడిస్తున్నాడు.
అయితే ఇంట్లో ఖాళీగా ఉంటున్న యువీతో అతని తల్లి బాసన్లు తోమించింది. అంతేకాకుండా అతనికి తెలియకుండా వీడియో తీసింది. ఈ వీడియోను తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్న యువరాజ్.. 'ఇంకా నయం చీపురు పట్టి ఇళ్లు శుభ్రం చేస్తున్న వీడియోలను తీయలేదు. సంతోషం'అని క్యాప్షన్గా పేర్కొన్నాడు. ఇక ఆ వీడియోలో యువీ తల్లి..'ఇంత వరకు కని విని ఎరుగని ఆసక్తికరమైన ఘటనను చూపించబోతున్నాను'అని తెలిపింది. ఇక ఇదేం తెలియని యువీ తిన్న ప్లేట్స్ను శుభ్రం చేస్తున్నాడు.
ఇక యువీ కామెంట్కు అతని సతీమణి, బ్రిటీష్-ఇండియా నటి హాజెల్ కీచ్ ఫన్నీగా స్పందించింది. 'అసలు నువ్వు చీపురు పట్టి ఇళ్లు ఊడిస్తే కదా వీడియోలు ఉండటానికి.. నీవు నీ బిల్డప్'అంటూ సిక్సర్ల సింగ్ గాలి మొత్తం తీసేసింది.
గతేడాది వన్డే ప్రపంచకప్లో చోటు దక్కకపోవడంతో టోర్నీ జరుగుతుండగానే యువీ రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత్ తరఫున 40 టెస్ట్లు, 304 వన్డేలు, 58 టీ20లు ఆడిన యువీ.. సంప్రదాయక ఫార్మాట్లో 1900, వన్డేల్లో 8701 రన్స్, పొట్టి క్రికెట్లో 1177 రన్స్ చేశాడు.