
హైదరాబాద్: భారత మాజీ క్రికెటర్, రంజీల్లో బెంగాల్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ గోపాల్ బోస్(71) కన్నుమూశారు. గుండెపోటుతో ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ ఆసుపత్రిలో ఆదివారం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, కుమారుడు అర్జిత్ ఉన్నారు.
గోపాల్ బోస్ భారత్ తరుపున ఒకే ఒక్క మ్యాచ్ ఆడారు. ఓపెనర్ బ్యాట్స్మెన్ అయిన బోస్.. 78 ఫస్ట్క్లాస్ క్రికెట్ మ్యాచ్లు ఆడారు. మొత్తం 3,757 పరుగులు చేశారు. అందులో 8 సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మంచి బౌలర్ అయిన బోస్ బౌలింగ్లో 72 వికెట్లు కూడా తీశారు.
1974లో భారత్ తరఫున ఇంగ్లాండ్తో తొలి వన్డే ఆడారు. బెంగాల్ నుంచి అప్పటి వరకు టీమిండియాకు ఆడిన తొలి క్రికెటర్ బోసే కావడం విశేషం. 1973-74లో శ్రీలంకతో జరిగిన అనధికార పర్యటనలో సునీల్ గావస్కర్తో కలిసి 194 పరుగులు చేశారు.
1975లో శ్రీలంక పర్యటనకు మరోసారి అవకాశం వచ్చినప్పటికీ తృటిలో చేజారింది. ఆ తర్వాత బెంగాల్ జట్టుకు కోచ్గా బాధ్యతలు చేపట్టారు. ఎంతో మంది అద్భుత ఆటగాళ్లను తయారుచేశారు. 2008లో కౌలాలంపూర్లో జరిగిన వరల్డ్ కప్ను ముద్దాడిన కోహ్లీ నేతృత్వంలోని అండర్-19 జట్టుకు గోపాల్ బోస్ మేనేజర్గా వ్యవహరించారు.
ఇదిలా ఉంటే, గోపాల్ బోస్ మృతికి పలువురు సంతాపం తెలిపారు. బోస్ మరణ వార్త విన్న క్యాబ్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తాను ఓ ఆప్తుడిని కోల్పోయాంటూ ట్వీట్ చేశారు. గోపాల్ బోస్ మృతి భాధాకరమని, ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు.