
ముంబై: భారత మాజీ టెస్ట్ క్రికెటర్ సదాశివ్ పాటిల్ (86) మరణించారు. మహారాష్ట్ర, కొల్హాపూర్లోని తన నివాసంలో రాత్రి భోజనం చేసి పడుకున్న పాటిల్ నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. ఈ తెల్లవారుజామున నిద్రలేవకపోయేసరికి కుటుంబసభ్యులు ఆయన మరణించిన విషయాన్ని గుర్తించారు. పాటిల్కు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఆయన భారత్ తరఫున ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడారు. ఆ తర్వాత మళ్లీ దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కలేదు. ఇక పాటిల్ మరణవార్తను కొల్హాపుర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ధృవీకరించింది.
పేసర్ కమ్ ఆల్ రౌండర్ అయిన సదాశివ్ పాటిల్ 1955లో న్యూజిలాండ్తో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడారు. నాటి భారత కెప్టెన్ పోలి ఉమ్రిగర్ సారథ్యంలో అంతర్జాతీయ క్రికెట్లోకి ఆరంగేట్రం చేశారు. ఈ మ్యాచ్లో ఇన్నింగ్స్కు ఒక వికెట్ చొప్పున పాటిల్ రెండు వికెట్లు తీశాడు. రెండు సార్లు జాన్ రీడ్నే ఔట్ చేశాడు. ఈ మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్, 27 రన్స్ తేడాతో న్యూజిలాండ్ను ఓడిచింది. ఇక తన అంతర్జాతీయ అరంగేట్రానికి ముందు సదాశివ్ పాటిల్.. న్యూజిలాండ్తో వెస్ట్ జోన్ తరఫున ఆడి(7/74) ఏడు వికెట్లతో రాణించాడు.
అంతకు ముందు మహారాష్ట్ర తరఫున 1952-64 మధ్య 11 సీజన్లలో ఆయన 36 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడి 866 పరుగులు చేశారు. 83 వికెట్లు తీశారు. అంతేగాక, పాటిల్ రంజీ ట్రోఫీలో మహారాష్ట్ర జట్టుకు కెప్టెన్గా కూడా వ్యవహరించారు. భారత జట్టులో మళ్లీ అవకాశం రాకున్నా.. లాంక్షైర్ లీగ్లో ఆడాడు. 52 మ్యాచ్ల్లో 111 వికెట్లు పడగొట్టాడు. ఇక పాటిల్ మరణం పట్ల మాజీ క్రికెటర్లు, మహరాష్ట్ర ఆటగాళ్లు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.