హైదరాబాద్ క్రికెట్కు పునర్వైభవం తెస్తా
నామినేషన్ దాఖలు చేసిన అనంతరం అజహర్ మాట్లాడుతూ... 'హైదరాబాద్ క్రికెట్కు పునర్వైభవం తెచ్చేందుకు నావంతు కృషి చేస్తా. హెచ్సీఏ క్రికెట్ను ముందుకు తీసుకెళ్లడమే నా ముందున్న లక్ష్యం. అధ్యక్ష పదవికి అందుకే నామినేషన్ వేశా. ప్రతీ ఒక్కరి నుంచి సలహాలు తీసుకుంటూ హైదరాబాద్ క్రికెట్ను ఉన్నత స్థానంలో నిలపాలనుకుంటున్నా' అని అజహర్ తెలిపారు.
జిల్లా స్థాయిలో క్రికెట్ను తీర్చిదిద్దాలి
'జిల్లా స్థాయి క్రికెట్ను కూడా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. జిల్లా స్థాయిలోనే చాలా టాలెంటెడ్ క్రికెటర్స్ ఉన్నారు. హైదరాబాద్ నుంచి దాదాపు 7-8 మంది క్రికెటర్స్ దేశం తరఫున ప్రాతినిథ్యం వహించాలనుకుంటున్నా. అందుకోసం చాలా శ్రమించాలి. అందుకు నేను సిద్ధంగా ఉన్నా. నాకు విక్రమ్ మాన్ సింగ్తో పాటు మాజీ క్రికెటర్లు అర్హద్ అయూబ్, శివలాల్ యాదవ్లు సహకారం ఉంది' అని అజహర్ పేర్కొన్నారు.
ఎల్బీ స్టేడియంలో మ్యాచ్లు జరిగేలా చూస్తా
'జింఖానా గ్రౌండ్లో క్రికెట్ను పునరుద్దరించాలి. మేము జింఖానాలోనే చాలా క్రికెట్ ఆడాం. కానీ ఇప్పుడు ఆ మైదానంలోకి క్రికెటర్లను రానివ్వకపోవడం భాదాకరం. ఈ మైదానాన్ని పునరుద్దరించి క్రికెట్ ఆడేలా చూస్తా. ఉప్పల్లోని రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం అందుబాటులోకి వచ్చిన నుంచి ఎల్బీ స్టేడియంలో మ్యాచ్లు నిర్వహించడం లేదు. ఈ ప్రఖ్యాత మైదానంలో ఎన్నో గొప్ప మ్యాచ్లు జరిగాయి. ఇపుడు రాజకీయ మీటింగులకు అడ్డాగా మారిందని, ఎల్బీ స్టేడియంలో మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్లు జరిగేలా చూస్తా' అని అజహర్ చెప్పుకొచ్చారు.
వైస్ ప్రెసిడెంట్ రేసులో విక్రమ్
మాజీ క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ ఆర్పీ మాన్ సింగ్ కుమారుడు విక్రమ్ మాన్ సింగ్ వైస్ ప్రెసిడెంట్ రేసులో ఉన్నారని సమాచారం. రెండేళ్ల క్రితం హెచ్సీఏ అధ్యక్ష పదవికి అజహర్ నామినేషన్ వేయగా.. మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంలో అతనిపై నిషేధం తొలగించడానికి సంబంధించి సరైన వివరణ ఇవ్వకపోవడంతో నామినేషన్ను హెచ్సీఏ ఆమోదించలేదు.