న్యూఢిల్లీ: శ్రీలంక వేదికగా జరగనున్న లంక ప్రీమియర్ లీగ్(ఎల్పీఎల్)లో తాను ఆడుతున్నట్లు వస్తున్న వార్తలపై టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. అవన్నీ నిరాధారమైన వార్తలేనని కొట్టిపారేసాడు. సోమవారం ట్విటర్ వేదికగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చిన ఇర్ఫాన్.. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా జరిగే టీ20 లీగ్స్ ఆడాలనుకుంటున్నట్లు తెలిపాడు. కానీ ప్రస్తుతానికైతే ఏ లీగ్లో తాను ఆడటం లేదని, ఆడుతున్నట్లు కూడా అధికారికంగా చెప్పలేదని స్పష్టం చేశాడు.
I wish to play T20 Legues around the world in future, but at this stage I haven't confirmed my availability in any Leagues.
— Irfan Pathan (@IrfanPathan) August 3, 2020
'భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా జరిగే టీ20 లీగ్స్ ఆడాలనుకుంటున్నా. కానీ ఇప్పటికైతే నేను ఏ లీగ్కు అందుబాటులో ఉన్నట్లు చెప్పలేదు.'అని ట్వీట్ చేశాడు. ఆగస్టు 28న శ్రీలంకలో లంక ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది. అయితే ఈ టోర్నీలో ఇర్ఫాన్ ఆడనున్నాడని, శ్రీలంక క్రికెట్ బోర్డు అతడి పేరును పరిగణనలోకి తీసుకుందని ఇటీవల వార్తలు వచ్చాయి.ఈ లీగ్ 70 మంది విదేశీ ఆటగాళ్ల జాబితాలో పఠాన్ పేరు ఉందని, అతను బరిలోకి దిగడం ఖాయమని ప్రచారం కూడా జరిగింది.
ఇక ఇర్ఫాన్ పఠాన్ ఈ ఏడాది జనవరిలో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకడం,... విదేశీ లీగ్ల్లో ఆడేందుకు బీసీసీఐ నుంచి ఎటువంటి అడ్డంకులు ఎదురయ్యే అవకాశం లేకపోవడం.. ఈ వార్తలకు బలం చేకూర్చింది. 35 ఏళ్ల ఇర్ఫాన్ పఠాన్ 2007 టీ20 ప్రపంచకప్ నెగ్గిన భారత జట్టులో కీలక పాత్ర పోషించాడు.
తప్పుని ఒప్పుకోండి చర్యలు తీసుకోం.. ఫేక్ డాక్యుమెంట్స్పై ఆటగాళ్లకు బీసీసీఐ లాస్ట్ ఛాన్స్!