సిడ్నీ: తనతో మంచిగా నటించి వెనకాల గోతులు తీసారని ఆస్ట్రేలియా ఆటగాళ్లను ఉద్దేశించి ఆ జట్టు మాజీ కోచ్ జస్టిన్ లాంగర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్తో పాటు మరికొందరు తనను కోచింగ్ పదవి నుంచి తప్పించేలా చేశారని ఆరోపించాడు. జస్టిన్ లాంగర్ కోచ్గా ఉన్న సమయంలో ఆస్ట్రేలియా 2021 టీ20 ప్రపంచకప్ గెలవడంతో పాటు యాషెస్ సిరీస్ను కూడా సొంతం చేసుకుంది. ఇంత చేసినా ఈ ఏడాది క్రికెట్ ఆస్ట్రేలియా అతడిని తొలగించి ఆండ్రూ మెక్ డొనాల్డ్ ను ఫుల్ టైమ్ కోచ్ గా నియమించింది. అయితే తనను తొలగించడం వెనుక ప్రస్తుత ఆసీస్ టెస్టు, వన్డే సారథి ప్యాట్ కమిన్స్ తో పాటు మరికొంతమంది హస్తముందని లాంగర్ వాపోయాడు.
తాజాగా డైలీ మెయిల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లాంగర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నాకు వ్యతిరేకంగా ప్రచారం చేసినవాళ్లు పిరికివాళ్లు. కమిన్స్ తో పాటు మరికొందరు ఆటగాళ్లు నా ముందు మంచిగా నటించారు. కానీ నా వెనకే గోతులు తవ్వారు. నా గురించి, జట్టు గురించి బోర్డు వద్ద ఉన్నదీ లేనదీ కలిపి చెప్పారు. నా హయాంలోనే ఆసీస్ ప్రపంచ చాంపియన్గా అవతరించింది. అయితే దానిని ఎంజాయ్ చేసే మూడ్లో నేను లేను. ఇది చాలా కష్టంగా అనిపించింది. నన్ను అకారణంగా కోచ్ పదవి నుంచి తప్పించారు. కోచ్కు ఆటగాళ్లకు చిన్న చిన్న మనస్పర్థలు రావడం సహజమే. కానీ వ్యక్తుల స్వలాభం కోసం ఇలా చేయడం మాత్రం తప్పు'అని కమిన్స్ తో పాటు మరికొందరు ఆటగాళ్లను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు.
ఈ ఏడాది యాషెస్ సిరీస్ ముగిసిన తర్వాత ఆసీస్ పాకిస్తాన్ పర్యటనకు వెళ్లింది. ఈ పర్యటనకు ముందు లాంగర్ ను బాధ్యతల నుంచి తప్పించిన క్రికెట్ ఆస్ట్రేలియా.. ఆండ్రూ మెక్ డొనాల్డ్ ను నియమించింది. కానీ ఇటీవలే స్వదేశంలో ముగిసిన టీ20 ప్రపంచకప్ లో కంగారూలు కనీసం సెమీస్ కు కూడా చేరకపోవడం గమనార్హం. అయితే కెప్టెన్సీ పదవి కోసమే కమిన్స్.. జస్టిన్ లాంగర్ను తప్పించేలా పావులు కదిపాడనే ఆరోపణలున్నాయి.
అయితే ఈ వ్యాఖ్యలపై క్రికెట్ ఆస్ట్రేలియా ఆగ్రహం వ్యక్తం చేసింది. వీటిని వెనక్కి తీసుకోవాలని జస్టిన్ లాంగర్కు సూచించింది. ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదని, ఏ ఆటగాడు కూడా లాంగర్కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయలేదని, ఇది బోర్డు నిర్ణయమేనని స్పష్టం చేసింది.