హైదరాబాద్: సోమవారం ముంబైలో బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం(ఎస్జీఎమ్) జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో జస్టిస్ లోధా కమిటీ సిఫార్సుల అమలు విషయంలో ఎదురవుతున్న విషయాలపై ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశానికి తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ తరఫున మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ చ్చారు.
లోధా కమిటీ సిఫార్సుల అమలుపై బీసీసీఐ ప్రత్యేక కమిటీ
లోధా కమిటీ సిఫారసుల మేరకు 70 ఏళ్లు పైబడిన వారు క్రికెట్ సంఘాల్లో ఉండకూడదని ఓ నియమం ఉంది. అయితే శ్రీనివాసన్ వయసు 72 సంవత్సరాలు. ఈ నేపథ్యంలో సోమవారం సర్వసభ్య సమావేశం అనంతరం బయటకు వచ్చిన శ్రీనివాసన్ను మీడియా ప్రశ్నించింది. 72 సంవత్సరాలున్న మీరు ఈ సమావేశానికి ఏ విధంగా అర్హులు అని ఓ జర్నిలిస్ట్ అడిగిన ప్రశ్నకి శ్రీనివాసన్కు పట్టరాని కోపం వచ్చింది.
వెంటనే ఆయన సదరు ఆ జర్నలిస్ట్ను 'నువ్వు ఎక్కడ నుంచి వచ్చావు. ఏ ఛానెల్ నీది' అంటూ ఘాటుగా స్పందించారు. అనంతరం 'నీకు అభినందనలు. నన్ను మాట్లాడనివ్వకుండా చేశావు. ఆ మాట అడగడానికి నీకు ఏం హక్కు ఉంది' అంటూ జర్నలిస్ట్పై మండిపడ్డారు.
ఆ తర్వాత కొంత సమయం తీసుకుని శ్రీనివాసన్ లోధా కమిటీ సిఫారసుల అమలుకు ఏకగ్రీవంగా ఆమెదం తెలిపినట్లు ఆయన చెప్పారు. లోధా కమిటీ సిఫార్సుల అమలు విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి పేర్కొన్న సంగతి తెలిసిందే.