న్యూఢిల్లీ: భారత మహిళా క్రికెట్ జట్టుతో పాటు తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్పీఎల్)లో ఫిక్సింగ్ కలకలం రేగింది. బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) విచారణలో ఈ విషయం తాజాగా బయటపడినట్లు సమాచారం. మూడేళ్లలో అత్యంత విజయవంతమైన క్రికెట్ టోర్నీ టీఎన్పీఎల్. 2016లో ప్రారంభమైన టీఎన్పీఎల్ను ఎనిమిది ఫ్రాంచైజీ జట్లతో నిర్వహిస్తున్నారు. అయితే ఎనిమిది జట్లలో.. ఓ జట్టు విషయంలో ఫిక్సింగ్ కలకలంపై సందేహాలున్నాయి.
41బంతుల్లో సెంచరీ.. టీ20ల్లో రికార్డు బద్దలు కొట్టిన స్కాట్లాండ్ బ్యాట్స్మన్
'టీఎన్పీఎల్లోని ఓ జట్టు చివరి మూడు స్థానాల్లో ఒకటిగా ఉంది. ఆ జట్టు యాజమాన్యం నిర్వహణ శైలి, ఆటగాళ్లు, కోచ్ల ఎంపిక కూడా అనుమానాస్పదంగా ఉన్నాయి. గతంలో ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్ చేసిన జట్టుతో కూడా ఆ కోచ్ కలిసి పని చేశాడు. ఆ తర్వాత ఒక రంజీ టీమ్కు కోచ్గా వ్యవహరించాడు. కనీసం ఫస్ట్క్లాస్ క్రికెట్ కూడా ఆడని అతను ఐపీఎల్ సహాయక సిబ్బందిలో ఎలా అవకాశం దక్కించుకున్నాడో తెలియట్లేదు. టీఎన్పీఎల్కి ఎలా వచ్చాడో' అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
'ఈ వివాదంలో అంతర్జాతీయ క్రికెటర్లు ఎవరూ లేరు. ఒక భారత క్రికెటర్ ఉన్నాడంటూ తమకు కొన్ని వాట్సప్ మెసేజ్లు వచ్చాయంటూ కొందరు ఆటగాళ్లు విచారణలో వెల్లడించారు. ఆ వాట్సప్ మెసేజ్లను కూడా పరిశిలీస్తున్నాం' అని బీసీసీఐ ఏసీయూ హెడ్ అజిత్ సింగ్ షెకావత్ తెలిపారు. ఫిక్సింగ్ జరిగిందనే అనుమానంతో ఇద్దరు కోచ్లు సహా కొందరు ఫస్ట్క్లాస్ ప్లేయర్లు, లీగ్ అధికారులపై బీసీసీఐ ఏసీయూ నిఘా ఉంచనుందని ఆయన పేర్కొన్నారు.
భారత మహిళల క్రికెట్ జట్టు సభ్యురాలు ఒకరిని కూడా మ్యాచ్ ఫిక్సింగ్లోకి దించేందుకు బుకీలు ప్రయత్నం చేసినట్టు తాజాగా సమాచారం తెలిసింది. ఈ ఏడాది ఆరంభంలో స్వదేశంలో ఇంగ్లండ్తో సిరీస్కు ముందు బెంగళూరులో ఈ ఘటన చోటు చేసుకుందట. అయితే సదరు క్రికెటర్ వెంటనే బీసీసీఐ ఏసీయూకు విషయం తెలపడంతో.. సోమవారం బెంగళూరులో ఇద్దరు వ్యక్తులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే భారత మహిళా క్రికెటర్ ఎవరనేది సమాచారం తెలియరాలేదు.