అజహరుద్దీన్పై ఎఫ్ఐఆర్ నమోదు
ఓ జాతీయ మీడియా ప్రచురించిన కథనం ప్రకారం.. జెట్ ఎయిర్వేస్ మాజీ ఎగ్జిక్యూటివ్, డానిష్ టూర్స్ అండ్ ట్రావెల్ యజమాని షాహబ్ మొహమ్మద్ ఈ ఫిర్యాదు చేశారని సమాచారం తెలుస్తోంది. ట్రావెల్ ఏజెంట్ అయిన షాహబ్ మొహమ్మద్ చేసిన ఫిర్యాదుతో మజీబ్ ఖాన్, సుధీష్ అవిక్కల్, మహమ్మద్ అజహరుద్దీన్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని స్థానిక పోలీసులు తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.
టిక్కెట్లకు డబ్బులు చెల్లించా
షాహబ్ మొహమ్మద్ ఫిర్యాదు ప్రకారం... 2019 నవంబర్ 9 నుండి 12 వరకు సుధీష్ అవిక్కల్ అనే వ్యక్తి వివిధ అంతర్జాతీయ విమాన టికెట్లు బుక్ చేయించాడు. ముంబై, దుబాయ్, పారిస్, ట్యూరిన్, ఆమ్స్టర్డామ్, మునిచ్లకు వెళ్లే టికెట్లు తీసుకున్నారు. అజహరుద్దీన్, అవిక్కల్ ఆ టిక్కెట్లతో ప్రయాణించారు అని షాహబ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. డబ్బులు లేవని, అత్యవసరంగా వెళ్లాల్సి ఉందని అవిక్కల్ తనతో చెప్పడం.. అజహరుద్దీన్ వ్యక్తిగత సిబ్బంది హామీ ఇవ్వడంతో టిక్కెట్లకు డబ్బులు చెల్లించానని షాహబ్ తెలిపాడు.
అజహరుద్దీన్ పట్టించుకోలేదు
అవిక్కల్ నవంబర్ 12న తన బ్యాంక్ నుంచి డబ్బు జమ చేస్తున్నట్లు చెప్పినా.. నవంబర్ 15 వరకు జమకాలేదు. రూ .21 లక్షలు విమాన టికెట్లకు చెల్లించాను. ఈ విషయంపై అజహరుద్దీన్, ముజీబ్ ఖాన్లను సంప్రదించినా.. వాళ్లిద్దరూ కూడా పట్టించుకోలేదు. ఇక నవంబర్ 24న అవిక్కల్ తన ట్రావెల్ ఏజెన్సీ పేరిట రూ.21,45,000 చెల్లిస్తున్నట్లు ఒక చెక్ ఫొటోను నా వాట్సాప్కు పంపించాడు. కానీ.. ఇప్పటి వరకు డబ్బు అందలేదు అని ఫిర్యాదు దారుడు తెలిపాడు.
|
తప్పుడు ఆరోపణలు:
ఇదిలా ఉంటే.. అజహరుద్దీన్ బుధవారం రాత్రి ఈ చీటింగ్ కేసు ఫిర్యాదుపై స్పందించాడు. తన ట్విటర్లో ఒక వీడియో పోస్టు చేస్తూ వివరణ ఇచ్చాడు. 'నేను ఎవరినీ మోసం చేయలేదు. ఇవన్నీ తప్పుడు ఆరోపణలు. నాపై నమోదైన ఎఫ్ఐఆర్ పట్ల న్యాయవాదులతో సంప్రదిస్తున్నా' అని అజహరుద్దీన్ తెలిపాడు.