అనుమతి లభించగానే..
ట్రైనింగ్ క్యాంప్కు గ్రీన్ సిగ్నల్ రావడమే ఆలస్యం గ్రౌండ్లోకి దిగేందుకు సిద్ధమని టీమిండియా ఫీల్డింగ్ కోచ్, హైదరాబాద్కు చెందిన రామకృష్ణన్ శ్రీధర్ తెలిపాడు. కనీసం నాలుగు నుంచి ఆరు వారాల్లోనే ఆటగాళ్లు అత్యుత్తమ ఫిట్నెస్కు చేరుకునేలా.. నాలుగు దశల్లో శిక్షణ మాడ్యూల్ సిద్దం చేస్తున్నట్టు వెల్లడించాడు.
‘జాతీయ శిక్షణ శిబిరం నాలుగు నుంచి ఆరు వారాలపాటు కొనసాగితే ఆటగాళ్లందరినీ ఫిట్గా ఉంచేలా చేయవచ్చు. ఎందుకంటే ఫాస్ట్ బౌలర్లకు ఆరు వారాల సమయం పడితే, బ్యాట్స్మెన్కు కాస్త తక్కువ టైమ్ పట్టవచ్చు. క్యాంప్ ఎప్పుడనే విషయం తేలి అటు ప్రభుత్వ అనుమతి కూడా లభిస్తే మా పని ప్రారంభిస్తాం. సుదీర్ఘ కాలం తర్వాత ఆటగాళ్లు కూడా ప్రాక్టీస్ కోసం చాలా ఉత్సాహంగా ఉంటారు. అందుకే సరైన పద్దతిలో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది' అని తెలిపాడు.
ఆకాష్ చోప్రా ఈతరం వన్డే ఎలెవన్.. బుమ్రాకు నో చాన్స్!
గాయాలయ్యే ప్రమాదం..
చాలా రోజుల తర్వాత మైదానంలోకి అడుగుపెట్టే ఆటగాళ్లపై అధికంగా ఒత్తిడి తెస్తే గాయాలకు గురయ్యే ప్రమాదముందని శ్రీధర్ చెప్పాడు. ‘అందుకే నాలుగు దశల్లో ముందుకెళ్లాలని భావిస్తున్నాం. ముందుగా తక్కువ పరిమాణం-తక్కువ తీవ్రత, సాధారణ పరిమాణం-తక్కువ తీవ్రత, అధిక పరిమాణం-సాధారణ తీవ్రత, అధిక పరిమాణం-అధిక తీవ్రత స్థాయిలో క్రికెటర్లకు శిక్షణ ఇస్తాం. ఉదాహరణకు తక్కువ పరిమాణం-తక్కువ తీవ్రతలో ఓ బౌలర్ స్వల్ప రనప్తో రెండు ఓవర్ల పాటు బౌలింగ్ చేస్తాడు. ఇక ఫీల్డర్ 10 మీ. లేక 20మీ.ల నుంచి గరిష్టంగా ఆరు త్రోలు విసురుతాడు. అటు బ్యాట్స్మన్ సాధారణ వేగంతో కూడిన బౌలింగ్లో ఆరు నిమిషాలపాటు బ్యాటింగ్ చేస్తాడు. ఆ తర్వాత నెమ్మదిగా మరో దశను ఆరంభిస్తాం. ఇలా నాలుగో వారంలో మ్యాచ్ ప్రాక్టీస్ను అందుకోగలుగుతారు. ఆ తర్వాత శిక్షణ తీవ్రంగా ఉంటుంది' అని శ్రీధర్ వివరించాడు.
కొత్త ఐడియాలున్నాయి..
ఫీల్డింగ్ కోచ్గా శ్రీధర్ బాధ్యతలు అందుకున్న తర్వాత టీమిండియా ఫీల్డింగ్ ప్రమాణాలు పెరిగాయి. వినూత్న పద్ధతుల్లో ఆటగాళ్లతో ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేయిస్తూ ఫలితాలు రాబట్టిన శ్రీధర్ తన మదిలో మరిన్ని కొత్త ఐడియాలు ఉన్నాయని చెప్పాడు. ‘ఇప్పటికైతే మేం తిరిగి మైదానంలోకి వెళ్లిన తర్వాత ప్రాక్టీస్ సెషన్స్ ఎలా ప్లాన్ చేయాలని ఆలోచిస్తున్నా. అలాగే కొన్ని కొత్త టెక్నిక్స్ కూడా నా మైండ్లో ఉన్నాయి. వాటిపై ఇంకా వర్క్చేయాలి. ఆ టెక్నిక్స్ ఎలా ఉంటాయో క్యాంప్ మొదలైన తర్వాత అందరూ చూస్తారు. అయితే, టాప్ లెవెల్ క్రికెటర్లకు ఏం అవసరమో ఆ దిశగానే మా ఆలోచనలు ఉంటాయి'అని శ్రీధర్ పేర్కొన్నాడు.