|
అశ్విన్కు కరెక్టే..
రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు తీసుకున్న రవిచంద్రన్ అశ్విన్.. రెండో ఇన్నింగ్స్లో మరో రెండు వికెట్లు తీసుకోవడంతోపాటు 42 పరుగులతో అజేయంగా నిలిచాడు. శ్రేయాస్ అయ్యర్ (29 నాటౌట్)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. దాంతో ఈ మ్యాచ్లో అశ్విన్కే 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. ఈ అవార్డు విషయంలో ఎవరూ ఎలాంటి కంప్లయింట్ చేయడం లేదు. అయితే 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు మాత్రం కచ్చితంగా యువ ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్కే దక్కుతుందని అంతా భావించారు.
|
కష్టాల్లో ఉన్నప్పుడే..
మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు 87 పరుగులు చేశాడు అయ్యర్. ఇక రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో పంత్తో కలిసి జట్టును ఆదుకున్న అతను 86 పరుగుల వద్ద అవుటయ్యాడు. రెండో ఇన్నింగ్స్లో జట్టు 94/4 స్కోరుతో పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు అశ్విన్తో కలిసి మరోసారి జట్టును ఆదుకున్నాడు. మ్యాచ్ ముగిసే సరికి 29 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీళ్లిద్దరూ కలిసి 71 పరుగుల అజేయ భాగస్వామ్యంతో జట్టును విజయ తీరానికి చేర్చారు. మొత్తమ్మీద ఈ రెండు టెస్టుల్లో కలిపి శ్రేయాస్ 202 పరుగులు చేశాడు.
|
పుజారా ఏం చేశాడు?
ఈ సిరీస్లో మొత్తం నాలుగు ఇన్నింగ్స్లలో బ్యాటింగ్ చేసిన పుజారాకు 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు దక్కింది. అతను తొలి టెస్టులో 90, 102 పరుగులతో ఆకట్టుకున్నాడు. అయితే రెండో టెస్టులో పూర్తిగా విఫలమయ్యాడు. మొదటి ఇన్నింగ్స్లో 24 పరుగులకు అవుటవ్వగా.. రెండో ఇన్నింగ్స్లో కేవలం 6 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. అలాంటి అతనికి 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు ఇవ్వడంపై క్రీడాభిమానులు మండిపడుతున్నారు.
|
ఫ్యాన్స్ ఆగ్రహం..
ఈ అవార్డులను నిర్ణయించే బ్రాడ్కాస్టర్ల ప్యానెల్ను టార్గెట్ చేస్తూ తిట్టిపోస్తున్నారు. 'ఏ లెక్కన పుజారాకు ఈ అవార్డు ఇచ్చారు? మీకేమైనా కళ్లు దొబ్బాయా?' అని సీరియస్గా కామెంట్లు చేస్తున్నారు. ఈ అవార్డు ప్రకటించడానికి ముందే తన అవార్డు అందుకున్న అశ్విన్.. శ్రేయాస్కు ఏ అవార్డూ దక్కకపోతే తను చాలా బాధపడతానని చెప్పాడు. అవసరమైతే తన అవార్డును అతనితో పంచుకుంటానన్నాడు.