బెస్ట్ కెప్టెన్లలో కోహ్లీ..
తను టెస్టు కెప్టెన్గా ఉన్నప్పుడు కోహ్లీ అదే విధానాన్ని అనుసరించాడు. ఫ్లాట్ పిచ్లపై కూడా మ్యాచులు గెలిచాడు. ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్ను తన ఖాతాలో వేసుకున్నాడు. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ మొదలైన తొలి ఏడాదే టీమిండియాను ఫైనల్ చేర్చాడు. కానీ అప్పటికే అతను ఫామ్ కోల్పోవడం, మిగతా సీనియర్లు కూడా పేలవంగా ఆడటంతో ఆ మ్యాచ్లో భారత్ ఓడింది. టెస్టు కెప్టెన్గా మొత్తం 68 మ్యాచులు ఆడిన కోహ్లీ.. వాటిలో 40 మ్యాచులు గెలిచి, భారత్ తరఫున అత్యంత విజయవంతమైన టెస్టు సారధిగా రికార్డు సృష్టించాడు. ప్రపంచ దిగ్గజాలు కూడా టెస్టుల్లో అత్యుత్తమ కెప్టెన్లలో కోహ్లీ ఒకడని కితాబిచ్చారు.
స్టోక్స్ పగ్గాలు అందుకున్నాక..
ఈ ఏడాది ఆరంభంలో టెస్టు కెప్టెన్సీకి కోహ్లీ వీడ్కోలు పలికాడు. దీంతో మళ్లీ టెస్టు క్రికెట్కు గడ్డు రోజులు వచ్చేశాయని అభిమానులు అనుకున్నారు. అయితే బెన్ స్టోక్స్ సారధ్యంలోని ఇంగ్లండ్ టెస్టు టీం ఈ స్థానాన్ని భర్తీ చేస్తోంది. టెస్టు కోచ్గా బ్రెండన్ మెకల్లమ్ రాకతో ఆ జట్టు ఆటతీరే మారిపోయింది. 'బాజ్ బాల్' ఆటతీరు, బెన్ స్టోక్స్ బోల్డ్ నిర్ణయాలతో టెస్టు క్రికెట్ను ఇంగ్లండ్ మరింత రసవత్తరంగా మార్చేస్తోంది. స్టోక్స్, మెకల్లమ్ జోడీ ఇంగ్లండ్ టెస్టు పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఆ జట్టు ఆటతీరే మారిపోయింది. న్యూజిల్యాండ్ను స్వదేశంలో క్లీన్ స్వీప్ చేసిన ఆ జట్టు.. భారత్తో జరిగిన ఐదో టెస్టులో కూడా అద్భుతంగా రాణించి విజయం సాధించిన సంగతి తెలిసిందే.
రావల్పిండిలో బోల్డ్ డెసిషన్..
తాజాగా పాకిస్తాన్తో జరిగిన టెస్టులో కూడా చివరి ఇన్నింగ్స్ను అనూహ్యంగా డిక్లేర్ చేసిన ఇంగ్లండ్.. అద్భుతమైన పోరాటంతో ఆ మ్యాచ్లో విజయం సాధించింది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని టీమిండియా, స్టోక్స్ కెప్టెన్సీలోని ఇంగ్లండ్.. ఈ రెండు జట్లలో ఏ టీం ప్రమాదకరంగా కనిపిస్తోంది? అని సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. అయితే సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ దేశాల్లో ఇంకా బెన్ స్టోక్స్ తన సత్తా నిరూపించుకోలేదని కొందరు క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు. అక్కడ కూడా విజయాలు సాధించే వరకు కోహ్లీతో పోలిక సరికాదని వాదిస్తున్నారు.