సెన్సేషనల్ బ్యాటింగ్..
సూర్యకు అంతర్జాతీయ టీ20ల్లో ఇది రెండో శతకం కాగా.. రెండు సెంచరీలు విదేశాల్లోనే చేయడం గమనార్హం. అంతేకాకుండా ఈ ఏడాదే ఈ రెండు సెంచరీలు అందుకోవడం మరో విశేషం. ఇంగ్లండ్పై తొలి సెంచరీ నమోదు చేసిన సూర్య.. తాజా శతకంతో ఒకే క్యాలండర్ ఇయర్లో రెండు సెంచరీలు చేసిన రెండో భారత బ్యాటర్గా రోహిత్ రికార్డును సమం చేశాడు. 15 ఓవర్లు ముగిసే సమయానికి 31 బంతుల్లో 49 పరుగులు మాత్రమే చేసిన సూర్యకుమార్ యాదవ్, ఆఖరి 5 ఓవర్లలో 20 బంతులు ఎదుర్కొని 62 పరుగులు చేశాడు. ఆఖరి 5 ఓవర్లలో 50+ స్కోర్ రాబట్టడం సూర్యకి ఇది మూడోసారి. భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత టీ20 స్కోర్ కలిగిన మూడో బ్యాటర్గా నిలిచాడు. కోహ్లీ(122), రోహిత్(118) సూర్య కన్నా ముందున్నారు.
ఇంగ్లండ్తో సెమీస్లో చేసుంటే..?
సూర్య అసాధారణ ఇన్నింగ్స్పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తున్నా.. ఓ వర్గం అభిమానులు మాత్రం ట్రోల్స్ చేస్తున్నారు. టీ20 ప్రపంచకప్ వంటి ప్రధాన టోర్నీల్లో చేయని సెంచరీలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. కీలక మ్యాచ్లో విఫలమై.. ద్వైపాక్షిక సిరీస్ల్లో రాణిస్తే వచ్చేదేముందని లైట్ తీసుకుంటున్నారు. ఇదే సెంచరీ.. ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైనల్లో చేస్తే భారత్ ఫైనల్ చేరేది కదా? అని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు సూర్య పేరును తరతరాలు చెప్పుకునేదని కామెంట్ చేస్తున్నారు. ఒత్తిడి ఉన్న మ్యాచ్లు సూర్య ఆడలేడని విమర్శిస్తున్నారు. ప్రపంచకప్లో పాకిస్థాన్తో జరిగిన హైఓల్టేజ్ మ్యాచ్లో విఫలమైన సూర్య.. ఆ తర్వాత మూడు హాఫ్ సెంచరీలు చేశాడని, కీలక సెమీస్లో మాత్రం చేతులెత్తేశాడని గుర్తు చేస్తున్నారు.
టీవీల్లో రాకపోవడంతో..
ఇంకొందరు మాత్రం టీ20 ప్రపంచకప్లో టీమిండియా వైఫల్యాన్ని మరిచిపోలేకపోతున్నామని కామెంట్ చేస్తున్నారు. భారత్-న్యూజిలాండ్ సిరీస్ టీవీల్లో రాకపోవడం కూడా తమకు ఆసక్తి లేకుండా చేసిందంటున్నారు. ఈ సిరీస్ను ఓటీటీ ఫ్లాట్ఫామ్ వేదికగా అమెజాన్ ప్రైమ్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుండగా.. డీడీ స్పోర్ట్స్లో కూడా మ్యాచ్ వస్తుంది. అయితే డీడీ స్పోర్ట్స్ డీటీహెచ్ కేబుల్ సౌకర్యం ఉన్నవారికి రాకపోవడంతో ఈ సిరీస్ను అభిమానులు ఆస్వాదించలేకపోతున్నారు.